అలలపై కలల సౌధం

ABN , First Publish Date - 2020-06-24T05:51:31+05:30 IST

ముంబయ్‌ మహానగరం... అరేబియా సముద్ర తీరం... అల్లంత దూరాన మూడంతస్తుల అద్భుత యాట్‌. నీటిపై తేలుతూ... రారమ్మని ఆహ్వానం పలుకుతుంది. అదే.. ‘ఏబీ సెలెస్టియల్‌’.

అలలపై కలల సౌధం

ఇంటి నిండా డబ్బు.

దేనికీ కొదవలేదు. 

నాన్న పెద్ద వ్యాపారవేత్త. అడిగిందేదీ కాదనలేదు. 

ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెది విలాసవంతమైన జీవితం. 

ఎక్కని విమానం... తిరగని దేశం లేదు. 

టీనేజీలోనే ప్రపంచాన్ని చుట్టిన అనుభవం.

ఆ అనుభవమేఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. 

అలలపై చక్కని ‘ఆతిథ్యం’ ఇవ్వాలని కలలు కన్నది. 

ఆ కలలకు రూపమే... భారత్‌లో మొట్టమొదటి ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ ‘ఏబీ సెలెస్టియల్‌’.

ఇది 24 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త 

ఐశ్వర్యా భేండే సక్సెస్‌ స్టోరీ... 


ముంబయ్‌ మహానగరం... అరేబియా సముద్ర తీరం... అల్లంత దూరాన మూడంతస్తుల అద్భుత యాట్‌. నీటిపై తేలుతూ... రారమ్మని ఆహ్వానం పలుకుతుంది. అదే.. ‘ఏబీ సెలెస్టియల్‌’. అందులోకి అడుగుపెడితే... కెరటాల కేరింతలు... నోరూరించే  వంటలు... ఆహా! మనసు ఉల్లాస ‘సాగర’మవుతుంది. విదేశాలకు వెళ్లినప్పుడు ఐశ్యర్యా భేండే ఇలాంటి అనుభూతినే పొందింది. కానీ దాన్ని ఆస్వాదించి అక్కడితో వదిలేయలేదు. మదిలో పదిలంగా దాచుకుంది. దానికో రూపం ఇచ్చి అలలపై తన కలల సౌధాన్ని నిర్మించింది. భారత్‌లో అంతకుముందు ఇలా అలలపై తేలియాడే లగ్జరీ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ లేదు. ‘ఏబీ సెలెస్టియల్‌’తోనే దేశానికి ‘ఫ్లోటెల్‌’ పరిచయమైంది. సంపన్న కుటుంబంలో పుట్టినా... డబ్బుకు వెనుకాడే పరిస్థితి లేకపోయినా... సెలెస్టియల్‌ కోసం ఐశ్వర్య ఎంతో శ్రమించాల్సి వచ్చింది. 


ఇదే మొదలు కాదు..! 

ఐశ్వర్య తండ్రి చేతన్‌ భేండే ‘డబ్ల్యూబీ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీస్‌ సొల్యూషన్స్‌’ సంస్థకు సీఈఓ. ఆయన ప్రభావం ఐశ్వర్యపై బాగా కనిపిస్తుంది. ముంబయ్‌లోనే పుట్టి పెరిగిన ఆమె అక్కడే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. సంగీతమంటే ఎంతో ఇష్టం. స్కూల్లో జరిగిన కార్యక్రమాల్లో గిటార్‌ వాయించేది. పాఠశాల స్థాయిలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు ఆడింది. ఎన్నిఉన్నా... ఏం చేసినా ఐశ్వర్యకు గొప్ప పారిశ్రామికవేత్త కావాలన్నది లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే చిన్న వయసులోనే అటువైపు అడుగులు వేసింది. 


‘‘పదహారేళ్లప్పుడు ‘అమ్నేషియా’ పేరుతో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ప్రారంభించాను. కంపెనీ తరఫున ఇంటర్నేషనల్‌ హోటల్స్‌లో ఈవెంట్స్‌ నిర్వహించేదాన్ని. అప్పుడే ఆతిథ్య రంగంపై ఆసక్తి కలిగింది. ముంబయ్‌ మహానగరం భారత ఆర్థిక రాజధాని. ప్రపంచంలో అత్యధికంగా పర్యటించే ప్రాంతాల్లో 14వ స్థానంలో ఉంది. ఈ లెక్కలు నన్ను మరింత ఆకర్షించాయి. ఆతిథ్య రంగం వైపు నడిపించాయి. అలాగనీ ఏ హోటలో... రిసార్టో పెట్టేసి సంతృప్తి పడే ఆలోచన లేనే లేదు. ఏదైనా సరే... రొటీన్‌కు భిన్నంగా, వినూత్నంగా ఉండాలనేది నా అభిప్రాయం. అదే సమయంలో దానివల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా కూడా దేశానికి ప్రయోజనం కలగాలి. అలా ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌కు మనసులో బీజం పడింది’’ అంటూ 

చెప్పుకొచ్చారు ఐశ్వర్య. 


వందకు పైగా అనుమతులు...  

‘ఫ్లోటెల్‌’కు కావాల్సిన వనరులన్నీ ఐశ్వర్య సమకూర్చుకున్నా... అనుమతుల విషయంలో ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చింది. ‘‘ప్రభుత్వం నుంచి 108 రకాల అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. లైసెన్స్‌ మొదలు ప్రాజెక్ట్‌కు ప్రత్యేక రోడ్డు వేసే వరకు అడుగడుగునా ఇబ్బందులే! వీటితోపాటు ఓడను నిర్వహించే సిబ్బందిని ఉద్యోగానికి తెచ్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఏ రోజుకారోజు వచ్చిపోయేవారయితే దొరుకుతారు. కానీ రెస్టారెంట్‌లోనే ఉండేవాళ్లు కూడా కావాలి. వాళ్లను నియమించుకోవడానికి నిజంగా తల ప్రాణం తోకకు వచ్చింది. వెనకాల నాన్న మద్దతు ఉంది కాబట్టి అనుకున్నది అనుకున్నట్టు చేసుకోగలిగాను. ఇక రెస్టారెంట్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నేనే చేసుకున్నా. నీలం, తెలుపు వర్ణాల్లో ఓడను అలంకరించాను. ప్రకృతి ఒడిలో... అలల సవ్వడులు వింటూ మైమరిచిపోతూ... ఎక్కడా లభించని థీమ్‌ బేస్డ్‌ కాక్‌టెయిల్స్‌, ఫుడ్‌ మెనూ ఆస్వాదిస్తూ ఆనందించవచ్చు ఇక్కడ’’ అంటారు ఐశ్వర్య. 


తారల తళుకులు... 


ఎంత ఖర్చు పెట్టినా, సరైన బ్రాండింగ్‌ లేకపోతే ఆశించిన ఫలితం రాదు. ఐశ్వర్య ఈ విషయంలోనూ ఓ అడుగు ముందే ఉంది. అందుకే ముంబయ్‌ సముద్ర తీరంలోని ఈ విలాసవంతమైన యాట్‌లో సందడి లేని రోజంటూ కనిపించదు. టైగర్‌ షరాఫ్‌, దిశా పటానీ, అలియా భట్‌, మందిరా బేడీ, అనిల్‌ కపూర్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌, మసాబా తదితర బాలీవుడ్‌ తారలు, ప్రముఖులు తరచూ ఇక్కడ సేదదీరుతుంటారు. మెర్సిడెస్‌ బెంజ్‌, అమెజాన్‌, గూగుల్‌, లాక్మే... ఇలా బడా బడా కంపెనీలన్నింటితో ఐశ్వర్య ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో పలు కార్పొరేట్‌ యాడ్స్‌కు ‘ఏబీ సెలెస్టియల్‌’ హాట్‌ స్పాట్‌గా మారింది. వీటన్నింటికీ మించి ‘ఎన్‌బీఏ’ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షి్‌పనకు ఈ యాట్‌ వేదికయింది. దీంతో ఐశ్వర్య బ్రాండ్‌ ఇమేజ్‌ అమాంతం పెరిగింది.


భయపడితే సాధించలేం...


ఐశ్వర్యలో ఉన్న అద్భుత లక్షణం... నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నించడం. పుస్తకాలు చదివి కాకుండా పని చేస్తూనే అందులో అనుభవం గడించడం ఆమె ప్రత్యేకత. ‘‘నేను చెప్పేదొక్కటే... మీ కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించండి. కాస్త ముందు వెనకా కావచ్చు... కానీ కచ్చితంగా వాటిని సాధించి తీరతారు. తొలి సంవత్సరం కోకాకోలా సంస్థ 25 బాటిల్స్‌ మాత్రమే అమ్మగలిగింది. మరి నేడు అది ఎంత పెద్ద బ్రాండో, సంస్థో తెలిసిందే! కాబట్టి రిస్క్‌ తీసుకోవడానికి భయపడవద్దు. సమయం విలువైనది. దాన్ని వృథా చేయవద్దు. మనసు పెట్టి ప్రయత్నిస్తే కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది’’ అంటూ నవతరంలో ఉత్సాహం నింపుతారు ఐశ్వర్య. 


Updated Date - 2020-06-24T05:51:31+05:30 IST