ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దయనీయం

ABN , First Publish Date - 2021-11-21T16:14:25+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత

ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దయనీయం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దయనీయంగా ఉంది. కొన్ని చోట్ల గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ నగరం గాలి నాణ్యత విషయంలో ‘‘వెరీ పూర్’’ కేటగిరీలో ఉంది. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నవారిపై ప్రభావం పడుతుంది. అదేవిధంగా అస్వస్థులపై మరింత తీవ్రంగా ఉంటుంది. 


కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆనంద్ విహార్, జహంగీర్ పురి, ముండ్కా, ఆర్కే పురం, రోహిణి, వివేక్ విహార్‌లలో ఏక్యూఐ 401 నుంచి 500 వరకు ఉంది. ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా వర్గీకరించారు. బలమైన గాలుల వల్ల ఆదివారం నుంచి గాలి నాణ్యత చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడుతుంది. 


ప్రజలు బస్సులు, మెట్రో రైళ్ళు వంటి ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా ప్రయాణించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) కోరింది. మెట్రో రైళ్లు, బస్సుల్లో ప్రయాణికులు నిల్చుని ప్రయాణం చేసేందుకు అనుమతి ఇచ్చింది. 


ఢిల్లీలో ఏక్యూఐ శనివారం ఉదయం 377, సాయంత్రం 374గా నమోదైంది. ఢిల్లీ నగరానికి పొరుగున ఉన్న ఘజియాబాద్‌లో 346, గుర్‌గావ్‌లో 348, నోయిడాలో 357, గ్రేటర్ నోయిడాలో 320, ఫరీదాబాద్‌లో 347గా ఏక్యూఐ నమోదైంది. 


ఏక్యూఐ 0-50 మధ్యలో ఉండటం మంచిది. 51-100 అయితే సంతృప్తికరం, 101-200 అయితే మధ్యస్థం, 201-300 అయితే దయనీయం, 301-400 అయితే చాలా దయనీయం, 401-500 అయితే అత్యంత తీవ్రం అని అర్థం. 


Updated Date - 2021-11-21T16:14:25+05:30 IST