‘అగ్నిపథ్‌’తో కొత్త శకానికి నాంది

ABN , First Publish Date - 2022-06-16T16:03:11+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం భారత సాయుధ బలగాల మానవ వనరుల విధానంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ బి. చంద్రశేఖర్‌ అన్నారు.

‘అగ్నిపథ్‌’తో కొత్త శకానికి నాంది

ఎయిర్‌ మార్షల్‌ బి. చంద్రశేఖర్‌

 అల్వాల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకం భారత సాయుధ బలగాల మానవ వనరుల విధానంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ కమాండెంట్‌ ఎయిర్‌ మార్షల్‌ బి. చంద్రశేఖర్‌ అన్నారు. భవిష్యత్‌లో దేశం క్రమశిక్షణ, నైపుణ్యం, దేశభక్తి గల యువతరాన్ని చూసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ఎయిర్‌ వార్‌ ఫెయిర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అగ్నిపథ్‌ వివరాలు వెల్లడించారు. 

2023 జూలై నాటికి మొదటి బ్యాచ్‌ అగ్నివీర్‌లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారన్నారు. నాలుగేళ్ల తరువాత సైన్యాన్ని విడిచి బయటకు వచ్చిన వారికి ఇచ్చే అగ్నివీర్‌ సర్టిఫికెట్‌లో కీలకమైన క్రెడిట్‌ పాయింట్లు ఉంటాయన్నారు. వాటిని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. 

దీంతో యువకులు ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఇతర ఉద్యోగాలను పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్పొరేట్‌, ప్రభుత్వ సంస్థల్లో అగ్నివీరులకు ప్రాధాన్యం లభిస్తోందన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ వ్యవస్థ తరహాలో యూనివర్సిటీలలో టర్న్‌డ్‌ ఆఫ్‌ టర్న్‌ ఎంట్రన్స్‌ అవకాశం ఉందన్నారు. సాయుధ దళాల్లోని అన్ని రిక్రూట్‌మెంట్‌లు అగ్నిపథ్‌ ద్వారా జరుగుతాయన్నారు.  

Updated Date - 2022-06-16T16:03:11+05:30 IST