అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు ఎయిర్ ఇండియా గుడ్‌న్యూస్

ABN , First Publish Date - 2020-07-06T04:12:43+05:30 IST

వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికా, భారత్ మధ్య జులై 11 నుంచి 19 వరకు 36 విమానాలను నడపనున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎయి

అమెరికాలో చిక్కుకున్న భారతీయులకు ఎయిర్ ఇండియా గుడ్‌న్యూస్

న్యూఢిల్లీ: వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికా, భారత్ మధ్య జులై 11 నుంచి 19 వరకు 36 విమానాలను నడపనున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని సంస్థ ఆదివారం తెలిపింది. అమెరికా టైమ్ జోన్ ప్రకారం.. న్యూయార్క్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి.. అదే విధంగా చికాగోలో 9.30 గంటల నుంచి, శాన్‌ఫ్రాన్సిస్కో‌లో 7.30 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుందని సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు ఇప్పటికే ఈ మిషన్‌లో భాగంగా భారత్‌కు చేరుకున్నారు. కాగా.. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్‌ను మే 7న ప్రారంభించింది. ఇప్పటికే మూడు విడతలు పూర్తికాగా.. ప్రస్తుతం నాలుగో విడత కొనసాగుతోంది. ఈ మిషన్‌లో భాగంగా ఇప్పటివరకు ఐదు లక్షలకు పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. కేవలం విమానాల ద్వారానే కాకుండా ఈ మిషన్‌లో యుద్దనౌకలు కూడా పాలుపంచుకున్నాయి. ఇప్పటికే ఇరాన్, శ్రీలంక, మాల్దీవుల్లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులు యుద్దనౌకల ద్వారా తమ మాతృభూమికి చేరుకున్నారు. ఆపరేషన్ సముద్ర సేతు కింద ఎనిమిది యుద్దనౌకలు ఈ మిషన్‌లో పాల్గొన్నాయి.

Updated Date - 2020-07-06T04:12:43+05:30 IST