వందే భారత్ మిషన్: హాంగ్ కాంగ్ నుంచి రెండు రిపాట్రియేషన్ విమానాలు
ABN , First Publish Date - 2020-08-14T19:28:52+05:30 IST
'వందే భారత్ మిషన్' కింద హాంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి ఆగస్టు 18,21 తేదీల్లో రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని హాంకాంగ్లోని భారత కాన్సులేట్ గురువారం తెలిపింది.
న్యూఢిల్లీ: 'వందే భారత్ మిషన్' కింద హాంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి ఆగస్టు 18,21 తేదీల్లో రెండు విమాన సర్వీసులు నడిపేందుకు ఎయిరిండియా సిద్ధంగా ఉందని హాంకాంగ్లోని భారత కాన్సులేట్ గురువారం తెలిపింది. ఈ విమానాల్లో ప్రయాణించే ప్రవాసులు ఎయిర్ ఇండియా నిర్ధేశించిన విమాన టికెట్ ధరలను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీకి చేరగానే వారి సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుందని కాన్సులేట్ జనరల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేగాక స్వదేశానికి వెళ్లాలనుకునే భారత ప్రవాసులు ముందుగా కాన్సులేట్ అధికారిక వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఎవరైతే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారో వారికి ఎయిర్ ఇండియా అధికారులు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారని తెలిపారు. కాగా, మే 6న ప్రారంభమైన 'వందే భారత్ మిషన్' ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మంది భారతీయులు విదేశాల నుంచి ఇండియాకు చేరుకుంటే... లక్ష 30 వేల మంది ప్రవాసులు భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్లారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.