కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో యూటర్న్ తీసుకున్న పైలట్
ABN , First Publish Date - 2020-05-30T21:10:28+05:30 IST
కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాస్కో..
న్యూఢిల్లీ: కోవిడ్-19 నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాస్కో బయలుదేరిన విమానం గమ్యం చేరకుండానే తిరుగుముఖం పట్టింది. తిరిగి భారత్ చేరుకుంది. శనివారంనాడు ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం పైలట్స్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని గ్రౌండ్ సిబ్బంది గ్రహించిస వెంటనే సమాచారం పంపడంతో విమానం వెనక్కి తిరిగి వచ్చింది. ఆ వెనువెంటనే విమాన సిబ్బందిని క్వారంటైన్కు తరలించారు.
'వందే భారత్ మిషన్ కింద భారతీయులను వెనక్కి తెచ్చేందుకు ఏ320 విమానం మాస్కో బయలుదేరింది. ప్రయాణికులు ఎవరూ అందులో లేరు. ఉబ్జెకిస్థాన్ గగనతలంలోకి విమానం అడుగుపెట్టే సమయానికి పైలట్లలో ఒకరికి కరోనా పాజిటివ్ అని గ్రౌండ్ సిబ్బంది గ్రహించారు. విమానాన్ని వెనక్కి మళ్లించాలని వెంటనే ఆదేశించడంతో మధ్యాహ్నం 12.30 గంటలకు విమానం ఢిల్లీకి తిరిగి వచ్చేసింది' అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. విమానాన్ని ఇన్ఫెక్షన్ లేకుండా శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని, మరో విమానం త్వరలోనే మాస్కో పంపుతామని అధికారులు చెప్పారు.