వందే భారత్ మిషన్: అమ్మకానికి ఎయిరిండియా ఎక్స్ప్రెస్ టికెట్లు..
ABN , First Publish Date - 2020-07-11T16:36:34+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను కేంద్రం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే.
యూఏఈ: కరోనా లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారత ప్రవాసులను కేంద్రం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు దశలు పూర్తి చేసుకున్న ఈ మిషన్... ఈ నెల 3 నుంచి నాలుగో దశ ప్రారంభించింది. దీనిలో భాగంగా యూఏఈ నుంచి భారత్కు ఈ నెల 15 నుంచి 31 వరకు ఎయిరిండియా విమానాలు నడపనుంది. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభించింది. ఇండియన్ ఎంబసీలో పేరు నమోదు చేసుకున్న ప్రవాసులు www.airindiaexpress.in వెబ్సైట్ ద్వారా కానీ, యూఏఈలోని గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల వద్ద కానీ విమాన టికెట్లు కొనుగోలు చేయొచ్చని భారత అధికారులు తెలిపారు. అయితే, టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణీకుల పాస్పోర్ట్ సమాచారంతో పాటు కాంటాక్ట్(మొబైల్) నెంబర్ తప్పనిసరి అని సూచించారు.
ఇక భారత ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన టికెట్ బుకింగ్ కేంద్రాన్ని అబుధాబి రాజధానిలో గల ఎలక్ట్రా స్ట్రీట్ నుంచి అల్ మినాలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ)కు మార్చిన విషయం తెలిసిందే. జూలై 10 నుంచి కార్యాకలాపాలు ప్రారంభించిన ఈ కార్యాలయం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. 'వందే భారత్ మిషన్'లో భాగంగా జూన్ 28 నుంచి డైరెక్ట్ సెల్ ప్రారంభించిన తర్వాత టికెట్ బుకింగ్ కోసం వస్తున్న భారత ప్రవాసుల రద్దీ అధికం కావడంతోనే కేంద్రాన్ని మార్చినట్టు అధికారులు పేర్కొన్నారు.