బిపిన్ మృతికి గల కారణాలపై ఇప్పుడే కామెంట్ చేయలేం : వివేక్‌రామ్

ABN , First Publish Date - 2021-12-18T17:05:20+05:30 IST

త్రివిధ దళపతి బిపిన్ రావత్ ఫ్లైట్ ప్రమాదంపై ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ స్పందించారు. ఈ ప్రమాదంపై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందని..

బిపిన్ మృతికి గల కారణాలపై ఇప్పుడే కామెంట్ చేయలేం : వివేక్‌రామ్

హైదరాబాద్ : బిపిన్ రావత్ విమాన ప్రమాదంలో మరణించిన ఘటనపై ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ చౌదరి స్పందించారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి వివేక్‌రామ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రావత్ విమాన ప్రమాదంపై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందని.. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారన్నారు. వాతావరణ తప్పిదమా..? మానవ తప్పిదమా..? లేక సాంకేతిక లోపమా..? అనేది విచారణ చేస్తున్నామని వివేక్‌రామ్ తెలిపారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ప్రమాదంపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. ఆధారాలు సేకరించిన తర్వాతే ఏమైనా మాట్లాడగలమన్నారు. రావత్ ఘటనపై ఏ చిన్న ఆధారాన్ని కూడా వదలదలుచుకోలేదని వివేక్‌రామ్ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి ఎవిడెన్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు.


ప్రతి సాక్షిని విచారించాలని.. ఇందుకోసం వారాల సమయం పడుతుందన్నారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం అక్కడ స్టేటస్ కో మేయింటేయిన్ చేస్తున్నామని వివేక్‌రామ్ పేర్కొన్నారు. సరిహద్దుల్లో బెదిరింపులు వస్తూనే ఉంటాయని... వాటికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మల్టీ డైమన్షన్ వార్‌పై దృష్టి సారించాలని కాడెట్స్‌కు చెబుతున్నామన్నారు. కేవలం యుద్ధం వైపే కాదు సాంకేతికంగా, సైబర్ పరంగా ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా తిప్పికొట్టేలా నైపుణ్యం సాధించాలని చెబుతున్నామన్నారు. డ్రోన్ దాడులు ఛాలెంజింగ్‌గా మారాయన్నారు. డ్రోన్ దాడుల నుంచి వీఐపీలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచే తాను ఈ స్థాయి వరకు వచ్చానని వివేక్‌రామ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-18T17:05:20+05:30 IST