లక్ష్యం.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి

ABN , First Publish Date - 2022-09-29T04:12:29+05:30 IST

‘జీవితంలో విద్యార్థి దశ కీలకం. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యసాధనకు సంకల్పబలంతో అడుగులు వేయాలి. అందులో భాగంగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. లక్ష్యం, ఆత్మవిశ్వాసం రెండు ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని’ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. సెయింట్‌ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ అటానమస్‌ హోదా పొందిన తరువాత మొదట సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో బుధవారం కళాశాలలో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

లక్ష్యం.. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయాలి
సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

   కలెక్టర్‌ విజయకృష్ణన్‌

చీరాల, సెప్టెంబరు 28 : ‘జీవితంలో విద్యార్థి దశ కీలకం. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యసాధనకు సంకల్పబలంతో అడుగులు వేయాలి. అందులో భాగంగా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. లక్ష్యం, ఆత్మవిశ్వాసం రెండు ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని’ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ చెప్పారు. సెయింట్‌ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ అటానమస్‌ హోదా పొందిన తరువాత మొదట సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో బుధవారం కళాశాలలో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రాఽథమికంగా ఐదు విషయాలను విద్యార్థులు ఎప్పుడూ గుర్తుంచుకుంటే విజయాలు దరిచేరతాయన్నారు. అందులో ఒకటి ఆడంబరమైన జీవితం లేకున్నా పర్వాలేదు. కానీ లక్ష్యం అనేది తప్పకుండా ఉండాలి. మనల్ని ఒకరు కించపరిచినా, అమర్యాదగా ప్రవర్తించినా ఉపేక్షించకుండా ప్రతిఘటించాలి. అందుకు ఆత్మవిశ్వాసం అవసరం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతి పరిజ్ఞానంలో సెల్‌ఫోన్స్‌ ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకు మాత్రమే వినియోగించుకోవాలి. అందుకు స్వీయనియంత్రణ అవసరం. ఆ తరువాత ప్రణాళిక, నిబద్ధత ఈ ఐదు అంశాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకుని అనుసరిస్తే మంచి విద్యార్థులుగా రాణించి, సమాజహితం కోరే మేటి పౌరులుగా ప్రతి ఒక్క విద్యార్థి ఎదగాలని ఆక్షాంకించారు. ఎక్కడున్నా, ఎలాఉన్నా అందరికన్నా మనల్ని అమితంగా ప్రేమించేది మన తల్లిదండ్రులన్న విషయాన్ని మరువకూడదని, వారికి ఇచ్చే స్థానం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని సూచించారు. వీటన్నింటితో పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం ఏర్పడుతుందన్నారు. తన విద్యార్థి దశలోని కొన్ని అంశాలను ప్రస్తావించారు. మరో అతిథి జేఎన్‌టీయూకే నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జీఎస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ అటానమస్‌ హోదాలో సెయింట్‌ఆన్స్‌ కళాశాల ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మొయిద వేణుగోపాల్‌ మాట్లాడుతూ యాజమాన్య ప్రతినిధుల సహకారంతో అటానమస్‌ హోదాలో సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో విద్యార్థులు చదివితే ఒనగూరే అదనపు ప్రయోజనాలను వివరించారు. ముందుగా కళాశాల సెక్రెటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు, అక్రిడేషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్బారావు తదితరులు మాట్లాడారు. అనంతరం యూనివర్శిటీ స్థాయిలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన కళాశాల పూర్వ విద్యార్థిని పర్వతరెడ్డి రాజరాజేశ్వరికి కలెక్టర్‌ షీల్డ్‌ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సరోజిని, చీరాల, వేటపాలెం తహసీల్దార్లు, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-29T04:12:29+05:30 IST