పల్లె పారిశుధ్యంపై గురి
ABN , First Publish Date - 2020-06-01T09:13:30+05:30 IST
వర్షాకాలం రాబోతోంది పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపరచకపోతే కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో
ఒక్కొక్క కుటుంబం నుంచి రెండు రూపాయలు వసూలు
ప్రజల భాగ్యస్వామ్యంతో అమలు
పైలట్ ప్రాజెక్టుగా మండలానికి రెండు గ్రామ పంచాయతీల ఎంపిక
జిల్లాలో 100 పంచాయతీలలో నేటి నుంచి అమలు
కడప, (ఆంధ్రజ్యోతి) మే 31 : వర్షాకాలం రాబోతోంది పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపరచకపోతే కరోనాతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం పల్లె పారిశుధ్యంపై దృష్టి సారించింది. ప్రజల భాగస్వామ్యంతో క్లీన్ గ్రామాలుగా మార్చాలని, గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన చెత్త సంపద కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మనం-మన పరిశుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సోమవారం నుంచి ఆరు మాసాల పాటు అమలు చేయనుంది. తొలుత మండలానికి రెండు పంచాయతీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. జిల్లాలో 100 పంచాయతీల్లో కార్యక్రమం అమలు కానుంది. మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆరు మాసాల పాటు కొనసాగించనున్నారు. జిల్లాలో 807 గ్రామ పంచాయతీలు, 774 చెత్త సంపద కేంద్రాలున్నాయి.
అయిదు వందల నివాసాలున్న కుటుంబాలను ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఒక్కొక్క కుటుంబం నుంచి రోజుకు రెండు రూపాయలు చొప్పున నెలకు రూ.60 వసూలు చేస్తారు. ఆ సొమ్ముతో చెత్త సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించనున్నారు. ఇంటింటికీ వసూలు చేసే డబ్బును వలంటీరు, గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి పేరిట బ్యాంకులో ఖాతా తెరిచి అందులో డిపాజిట్ చేయాలి. గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలు, చెత్త సేకరణ కేంద్రాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంది. జిల్లాలో 1975 మంది గ్రీన్ అంబాసిడర్లున్నారు. స్వచ్ఛభారత్ ద్వారా వేతనాలు చెల్లించేవారు. గత ఏడాది మే నుంచి వీరికి జీతాలు అందలేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాలకు వారికి వేతనాలు చెల్లించారు.
వినియోగంలోకి చెత్తసంపద కేంద్రాలు
చెత్తను ఎరువుగా మార్చి పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం చెత్త సంపద తయారీ కేంద్రాలను నిర్మించింది. అవి నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం వాటిని వినియోగంలోకి తీసుకురానున్నారు.