ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై టీడీపీ పోరాటం

ABN , First Publish Date - 2021-10-28T06:42:33+05:30 IST

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోకపోతే టీడీపీ పార్టీ చూస్తూ ఊరుకోదని మాజీ ఎమ్మెల్యే, అమలాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు హెచ్చరించారు

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై టీడీపీ పోరాటం

కాకినాడ సిటీ, అక్టోబరు 27: ఎయిడెడ్‌ పాఠశాలల విలీనాన్ని ఉపసంహరించుకోకపోతే టీడీపీ పార్టీ చూస్తూ ఊరుకోదని మాజీ ఎమ్మెల్యే, అమలాపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు హెచ్చరించారు జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలకు గ్రాంట్లు ఇవ్వాల్సి వస్తోందని అప్పుల ముఖ్యమంత్రి, అప్పుల ప్రభుత్వం విలీనం ఆలోచన చేసిందన్నారు. జిల్లాలో 168 ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల్లో సుమారు 16 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విలీనం చేయడం వల్ల ఆయా సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీ నిలిచిపోతుందన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలు ప్రైవేటు అయిపోతే విద్యార్థులకు ఉచిత విద్య అందదని, లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజుల భారంతో ఇబ్బంది పడతారన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల భవనాలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాలని ప్రభుత్వం చూ స్తోందన్నారు.  ఎయిడెడ్‌ విద్యాసంస్థల సంరక్షణ కోసం చేసే పోరాటానికి టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. జిల్లాలో కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు మితిమీరి మాట్లాడుతున్నారని, ఇదే తరహాలో మాట్లాడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-28T06:42:33+05:30 IST