ONline లోన్ యాప్లను రద్దు చేయాలి... KCRకు శ్రావణ్ బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2022-06-29T18:38:05+05:30 IST
ఆన్లైన్ లోన్యాప్లను రద్దు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఆన్లైన్ లోన్యాప్లను రద్దు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ (Dasoju Shravan) డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు శ్రావణ్ బహిరంగ లేఖ రాశారు. ఆన్లైన్ లోన్యాప్ల మాఫియా దుర్మార్గాలని ఆధారాలతో లేఖలో వివరించారు. ఆన్లైన్ లోన్యాప్ల మాఫియా కారణంగా అనేక మంది అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి నిత్యం ఆన్లైన్ లోన్ యాప్లపై ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసు శాఖలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసి అన్ని ఆన్లైన్ లోన్ యాప్లను అణిచివేయాలని కోరారు.
ఆన్లైన్ లోన్ యాప్లు చట్టవిరుద్ధంగా ప్రవేశించకుండా నిరోధించడానికి బలమైన సైబర్ సెక్యూరిటీ ఫైర్వాల్లను ఏర్పాటు చేయాలన్నారు. సమస్యను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేకమైన ఈమెయిల్ ఐడీతో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్, ఆర్బీఐ ఆమోదం ఉన్న యాప్లకే అనుమతి ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్రంగ బ్యాంకులు చిన్న, మధ్యతరహా, చిరు వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాల పేదలకు రుణాలు ఇచ్చేలా పాలసీ తేవాలని దాసోజు శ్రావణ్ లేఖలో పేర్కొన్నారు.