AICC Presidential elections: నామినేషన్ విత్డ్రా పుకార్లపై స్పందించిన శశిథరూర్
ABN , First Publish Date - 2022-10-07T03:38:56+05:30 IST
చెన్నై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని వచ్చిన పుకార్లను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ తోసిపుచ్చారు.
చెన్నై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ విత్ డ్రా చేసుకుంటారని వచ్చిన పుకార్లను ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ తోసిపుచ్చారు. తాను ఉపసంహరించుకోబోవడం లేదని, తనకు పార్టీ నాయకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని చెప్పారు. తాను విస్తృతంగా ప్రచారం చేస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నానని ఆయన చెన్నైలో చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన మరో అభ్యర్ధి మల్లికార్జున ఖర్గే ఈ నెల 7న గుజరాత్ వెళ్తున్నారు. సబర్మతీ ఆశ్రమం సందర్శించుకున్నాక ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసేందుకు వెళ్తారు. నిజానికి మల్లికార్జున ఖర్గే నామినేషన్ అనూహ్యంగా జరిగింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రేసు నుంచి తప్పుకోవడంతో ఖర్గేకు అవకాశం దక్కింది. రేసులో ఉండాలనుకున్న దిగ్విజయ్ సింగ్ తప్పుకున్నారు. ఖర్గేకు మద్దతు ప్రకటించారు.
ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. 19న ఎవరు గెలిచారో ప్రకటిస్తారు. ఈ నెల 8 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ. ఇద్దరూ బరిలో ఉంటారా లేక ఒకరు విత్ డ్రా చేసుకుంటారా అనేది 8వ తేదీ సాయంత్రానికి తెలిసిపోతుంది.
వాస్తవానికి మల్లికార్జున ఖర్గేకే సోనియా కుటుంబం అండదండలున్నాయని సమాచారం. అయినా కూడా అటు శశిథరూర్, మల్లికార్జున ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. సోనియా కుటుంబం అండ ఉండటంతో గెలిచేది ఖర్గేనే అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.