1.20 కోట్ల ఎకరాలు దాటిన సాగు!

ABN , First Publish Date - 2020-08-13T07:58:05+05:30 IST

వానాకాలం సాగు విస్తీర్ణం రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాలను దాటింది. వరి, పత్తి, కంది

1.20 కోట్ల ఎకరాలు దాటిన సాగు!

  • 42.29 లక్షల ఎకరాల్లో వరి విస్తీర్ణం
  • 60 లక్షల ఎకరాలకు చేరువలో పత్తి
  • వానాకాలంలో సాగుపై వ్యవసాయశాఖ నివేదిక

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగు విస్తీర్ణం రాష్ట్రంలో 1.20కోట్ల ఎకరాలను దాటింది. వరి, పత్తి, కంది పంటలతోపాటు ఇతర పంటలన్నీ కలిపి 1,20,33,667 ఎకరాల్లో సాగు అయ్యాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం సమర్పించింది. పత్తి పంట అత్యఽధికంగా 57,99,545 ఎకరాల్లో సాగు కావటం విశేషం. నియంత్రిత సాగులో ప్రభుత్వం నిర్దేశించుకున్న 60 లక్షల ఎకరాల సాగుకు పత్తి దాదాపు చేరుకుంది. వరిపంట కూడా రికార్డుస్థాయిలో 42,28,724 ఎకరాలకు చేరింది. నాగార్జునసాగర్‌ ఆయకట్టుతోపాటు ఇంకా కొన్ని చోట్ల వరి నాట్లు పూర్తికాలేదు. ఈ నెలాఖరు వరకూ వరి నాట్లు కొనసాగే అవకాశాలున్నాయి. కంది సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. 10,14,995 ఎకరాల్లో ఇప్పటివరకు సాగైంది. వరి సాగు 155 శాతం, కంది 133 శాతం, పత్తి 130 శాతం విస్తీర్ణంలో పండినట్లు వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది. రాష్ట్ర సాగు విస్తీర్ణం సాధారణంగా 1,03,47,715 ఎకరాలు ఉండగా.. ఇప్పటివరకు 1,20,33,667 ఎకరాల్లో పంట సాగు కావడం గమనార్హం. సాధారణంతో పోలిస్తే 16 శాతం ఎక్కువగా కలిపి మొత్తం 115 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. వనపర్తి, సూర్యాపేట, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లోనూ సాగు విస్తీర్ణం 100 శాతానికి మించి నమోదైంది. వర్షాలు కూడా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్నాయి. గత నెల నుంచి ఇప్పటివరకు 456.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 533.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక.. ఖమ్మం జిల్లాల్లో పత్తిని రసంపీల్చే పురుగు, పెసరను పొగాకు లద్దెపురుగు, నిజామాబాద్‌ జిల్లాలో మొక్కజొన్నను కత్తెర పురుగు, వరిని కాండంతొలిచే పురుగు పట్టినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-13T07:58:05+05:30 IST