దాళ్వా సాగుకు సమాయత్తం కావాలి
ABN , First Publish Date - 2021-12-08T05:21:27+05:30 IST
దాళ్వా సాగుకు ఏర్పాట్లపై అధికారులు సమాయాత్తం కావాలని వ్యవసాయశాఖ జేడీ జగ్గారావు సూచించారు.
భీమవరం రూరల్, డిసెంబరు 7: దాళ్వా సాగుకు ఏర్పాట్లపై అధికారులు సమాయాత్తం కావాలని వ్యవసాయశాఖ జేడీ జగ్గారావు సూచించారు. భీమవరం వ్యవసాయశాఖ కార్యాలయంలో పాలకొల్లు, నరసాపురం, ఆకివీడు, భీమవరం డివిజన్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సార్వా మాసూళ్లతో పాటు రైతులకు దాళ్వాసాగులో సౌకర్యాలు కల్పించడంపై సూచనలు ఇచ్చారు. ఆర్బీకేల్లో విత్తనాలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేయాల న్నారు. రైతులకు సాగు సూచనలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్, డ్రెయినేజీ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.
ఎరువులు అందుబాటులో ఉంచుతాం
దాళ్వా సాగుకు అవసరమైన ఎరువులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతామ ని వ్యవసాయశాఖ జేడీ జగ్గారావు తెలిపారు. డివిజన్ అధికారులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 948 రైతు భరోసా కేంద్రాల్లో 10 టన్నుల చొప్పు ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. గడిచిన సార్వాలో జిల్లాలో 774 రైతు భరోసా కేంద్రాల ద్వారా 8250 మెట్రిక్ టన్నులు ఎరువులు సరఫరా చేశామన్నారు. దాళ్వాలో 4.6లక్షల హెక్టార్లలో రైతులు వరి సాగు చేయనున్నట్లు ఆయన తెలిపారు.