జోరుగా వరినాట్లు
ABN , First Publish Date - 2020-07-13T10:45:51+05:30 IST
వానాకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు కురువడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన అన్నదాతలు
పెరిగిన సాగు పెట్టుబడులు
రైతు సేవాసహకార సంఘంలో అందుబాటులో ఎరువులు
ఘట్కేసర్ రూరల్: వానాకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు కురువడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఘట్కేసర్ మం డల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దొడ్డు, సన్నరకాలను సాగుచేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో పాటు కందులు, కూరగాయాల పంటలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. మండలంలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రైతులు వరి సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాధార గ్రామాలైన కొండాపూర్, అవుశాపూర్, అంకుశాపూర్, యంనంపేట్, ఇస్మాయిల్ఖాన్గూడ, పోచారం, అన్నోజిగూడ, ఘట్కేసర్, చందుపట్లగూడ, బొక్కెనిగూడ మూసీ పరివాహక ప్రాంతాలైన ఏదులాబాదు, పోతరాజి గూడ, కొర్రెముల, ప్రతా్పసింగారం, వెంకటాపూర్, మక్తా, సాదాత్ అలీగూడ, ముత్వేలీగూడ, కాచవాని సింగారం గ్రామాల్లోని రైతులు వరినాట్లు వేస్తున్నారు. ఈ సీజన్లో ఎక్కువ మంది బీపీటీ, ఆర్ఎన్ఆర్-15048, తెలంగాణ సోనా, దొడ్డురకాలైన ఎంటీయూ-1010, కేఎన్ఎం-1818, సంకరజాతీ(హైబ్రీడ్) వరి రకాలను సాగు చేస్తున్నారు. ఘట్కేసర్లోని రైతు సేవా సహకార సంఘంలో యూరియా, డీఏపీ, పోటాష్ ఎరువులను పంపిణీ చేస్తున్నారు.
ఖర్చులు బాగా పెరిగాయి..యాది మల్లేష్, రైతు, ఎదులాబాద్
వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి. మహిళాకూలీలకు రూ. 500ల నుంచి 600లు చెల్లిస్తున్నాము. ట్రాక్టర్ గంటకు రూ.2వేలు తీసుకుంటున్నారు. గతంలో కంటే ఈ యేడాది వ్యవసాయ ఖర్చులు ఎక్కువయ్యాయి. ఎకరాకు రూ.15వేలు ఖర్చు అవుతోంది.
ఎరువులు అందుబాటులో ఉన్నాయి..ఎం.ఏ.బాసిత్, వ్యవసాయాధికారి
వానాకాలం సీజన్కు సరిపోయే విధంగా ఎరువులను అందుబాటులో ఉంచాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఘట్కేసర్లోని రైతు సేవా సహకార సంఘం, ఎదులాబాద్లోని ఉపకేంద్రంలో ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతులు కావాల్సిన ఎరువులు, విత్తనాలను తీసుకెళ్లాలి.