Agnipath: హింసాత్మక నిరసనలపై Supreme court లో పిటిషన్
ABN , First Publish Date - 2022-06-18T20:17:23+05:30 IST
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' రిక్రూట్ స్కీమ్ కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు ..
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' రిక్రూట్ స్కీమ్ (Agnipath recruit scheme)కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడంపై సుప్రీంకోర్టు (Supreme court)లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ హింసాత్మక నిరసనలపై ప్రత్యేక విచారణ బృందం (SIT)తో దర్యాప్తునకు ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆ పిటిషన్ కోరింది. హింసాత్మక ఘటనల కారణంగా రైల్వేలతో సహా ప్రజా ఆస్తుల ధ్వంసంపై దర్యాప్తు జరపాలని, అగ్నిపథ్ పథకాన్ని, జాతీయ భద్రత, ఆర్మీపై దాని ప్రభావాన్ని సమీక్షిచేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా ఆదేశించాలని పిటిషన్దారు కోరారు.
ఢిల్లీ న్యాయవాది విశాల్ తివారీ (Vishal Tiwari) ఈ పిల్ వేశారు. రైల్వే అభ్యర్థులు బీహార్లో హైవేలను స్తంభింపజేశారని, పలుచోట్ల 20 రైల్వే బోగీలకు నిప్పుపెట్టారని అన్నారు. ఈస్ట్రన్ రైల్వే 164 రైళ్లు రద్దు చేసిందన్నారు. పాట్నా జంక్షన్తో సహా వివిధ రైల్వే స్టేషన్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడికక్కడే నిలిచిపోయారని పిటిషన్లో పేర్కొన్నారు. నిరసనల కారణంగా హైవేలు మూసేయడంతో బస్సుల కోసం బస్ టెర్నినల్స్లో ప్రయాణికులు నిలిచిపోయారని చెప్పారు. హింసాత్మక నిరసనల కారణంగా సుమారు 300 అంతర్రాష్ట్ర రైళ్లపై ప్రభావం పడిందని, 200కు పైగా ప్రధాన రైళ్ల రాకపోకలు రద్దయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, యూపీ, రాజస్థాన్, హర్యానా, బీహార్, తెలంగాణను రెస్పాండెట్లుగా పిటిషన్లో చేర్చారు.
కాగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో అగ్నిపథ్పై హోంశాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్లో రిక్రూట్మెంట్ కోసం అగ్నివీర్లకు సూచించిన గరిష్ఠ వయో పరిమితి కంటే 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అగ్నివీర్ మొదటి బ్యాచ్ కోసం సూచించిన గరిష్ఠ వయోపరిమితి కంటే 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.