Agnipath protests: బిహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేత

ABN , First Publish Date - 2022-06-18T16:47:07+05:30 IST

అగ్నిపథ్ పథకంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో బిహార్‌లోని

Agnipath protests: బిహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేత

పాట్నా : అగ్నిపథ్ పథకంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుండటంతో బిహార్‌లోని 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. జూన్ 19 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని ప్రకటించింది. వదంతులను వ్యాపింపజేయడం కోసం ఇంటర్నెట్ మీడియంను వాడుకుంటున్నందువల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 


బిహార్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 19 వరకు కైమేర్, భోజ్‌పూర్, ఔరంగాబాద్, రోహ్‌తాస్, బక్సర్, నవాడా, పశ్చిమ చంపారన్, సమస్తిపూర్, లఖీసరాయి, బేగుసరాయి, వైశాలి, సరన్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలిక నిలిపేస్తారు. శాంతి, సామరస్యాలను దెబ్బతీయడానికి, ప్రజల జీవితాలు, ఆస్తులకు నష్టం కలిగించడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి అవకాశం కల్పించే వదంతులను వ్యాపింపజేయడం కోసం అభ్యంతరకరమైన అంశాలను ప్రసారం చేయడం కోసం ఇంటర్నెట్ మీడియంను వాడుకుంటున్నందువల్ల ఈ చర్యలు తీసుకున్నారు. 


సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లేదా అప్లికేషన్స్ ద్వారా ఏదైనా చిత్రాల రూపంలోని కంటెంట్ లేదా ఏదైనా సబ్జెక్ట్‌కు సంబంధించిన కంటెంట్‌ను ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి లేదా కొందరు వ్యక్తుల సమూహానికి ఇచ్చి, పుచ్చుకోవడాన్ని ప్రసారం చేయవద్దని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వాట్సాప్, ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, స్కైప్, స్నాప్‌చాట్ వంటి వాటి ద్వారా సందేశాల ప్రసారాన్ని నిలిపేయాలని ఆదేశించింది. 


వీటికి వర్తించవు

ఈ ఆదేశాలు ప్రభుత్వ ఇంట్రానెట్, ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్‌కు వర్తించవు. బ్యాంకింగ్, రైల్వేలు వంటివాటికి కూడా వర్తించవు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 


ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత ఇళ్ళపై దాడి

రక్షణ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై పెద్ద ఎత్తున నిరసనలు బిహార్‌లోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించాయి. బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై నిరసనకారులు శుక్రవారం దాడి చేశారు. అనంతరం ఆమె అగ్నిపథ్ పథకాన్ని సమర్థించారు. ప్రతిపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రతిపక్షాల మద్దతుగల గూండాలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. 


బిహార్ బీజేపీ  అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ ఇంటిపై కూడా దాడి జరిగింది. తన ఇంటిని పేల్చేయాలనే ఉద్దేశంతోనే వీరు వచ్చారని, వీరు నిరసనకారులు కాదని, దుండగులని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-06-18T16:47:07+05:30 IST