అహింసాయుతంగా నిరసనలు తెలపండి: Sonia gandhi
ABN , First Publish Date - 2022-06-18T22:16:23+05:30 IST
కేంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్మెంట్ స్కీమ్పై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పౌరులంతా..
న్యూఢిల్లీ: కేంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్మెంట్ స్కీమ్(Military recruitment Scheme)పై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. "మీ (ప్రజా) వాణిని పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశం లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో అందరూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీతోనే ఉంటుంది" అని సోనియాగాంధీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యువతతో పాటు, పలువురు మాజీ సైనికులు, రక్షణ నిపుణులు కూడా అగ్నిపథ్ పథకాన్ని ప్రశ్నిస్తున్నారని, యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని సోనియాగాంధీ అన్నారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ల విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను తాను అర్ధం చేసుకోగలనని అన్నారు. ఎయిర్ఫోర్స్లో ప్రవేశానికి టెస్ట్లు రాసి ఫలితాలు, నియామకాల కోసం యువత ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో యువతకు అండగా నిలుస్తుందని, వారి ప్రయోజనాల కోసం, స్కీమ్ ఉపసంహరణ కోసం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. లోయర్ రెస్పిరేటర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, కోవిడ్ అనంతర సమస్యలతో ప్రస్తుతం ఢిల్లీలోని ఆసుపత్రిలో సోనియాగాంధీ చికిత్స పొందుతున్నారు.