అగ్నిమహాపురాణం, హరివంశం గ్రంథాలావిష్కరణ
ABN , First Publish Date - 2021-10-23T07:08:13+05:30 IST
టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ముద్రించిన అగ్నిమహాపురాణం (ప్రథమభాగం), ఉత్తర హరివంశం (ప్రథమ, ద్వితీయ సంపుటాలు) గ్రంథాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలో ఆవిష్కరించారు.
తిరుమల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ముద్రించిన అగ్నిమహాపురాణం (ప్రథమభాగం), ఉత్తర హరివంశం (ప్రథమ, ద్వితీయ సంపుటాలు) గ్రంథాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలో ఆవిష్కరించారు. సనాతన హైందవ ధర్మవ్యాప్తిలో భాగంగా ఇతిహాసాలను, పురాణాలను సరళమైన తెలుగులోకి అనువదించి సామాన్య పాఠకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. అగ్నిమహాపురాణాన్ని ఎస్వీయూ సంస్కృత విశ్రాంతాచార్యులు ప్రతాప్.. ఉత్తర హరివంశం గ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ తెలుగు విశ్రాంతాచార్యులు తుమ్మపూడి కోటేశ్వరరావు తెలుగులోకి అనువదించారన్నారు. ఈ గ్రంథాలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేసిన పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి విభీషణశర్మకు, పండిత పరిషత్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ పూర్వప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య, పండిత పరిషత్ సభ్యుడు కొంపెల్ల రామసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.