ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
ABN , First Publish Date - 2021-05-09T05:35:36+05:30 IST
ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
తొర్రూరు, మే 8: తాము పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మా టేడు గ్రామానికి చెందిన రైతులు శనివారం వరంగల్ -ఖమ్మం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అధికారులు కొనుగోలు చేస్తామని బిల్లులు ఇచ్చి కాంటాలు అయిన తర్వాత సరుకును మిల్లులకు పంపితే వ్యాపారులు దిగుమతి చేసుకోవట్లేదని సన్న ధాన్యాన్ని అసలే కొనుగోలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రైతులు వల్లపు యాకయ్య, దేవేందర్, రమే్షలు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకాలకే ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తుండటంతో మిల్లుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, సాగైన పంటలో 70శాతం సన్న రకాలే అన్నారు. పంట చేతికి వచ్చాక సాగు చేసిన రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని, ధాన్యం అమ్మడానికి అస్టకష్టాలు పడాల్సి వస్తుందని, నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం ఏర్పాటు చేసి కాంటాలు పెట్టిన తర్వాత క్వింటాల్కు 5 కేజీల నుంచి 7కేజీలు తరుగు పేరుతో కోత విధిస్తున్నారని, దీనిలో పీఏసీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కరోనా నేపథ్యంలో రైతులు ఒకేచోట గుమిగూడి ధర్నా చేస్తుండటంతో రెండు గంటలు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో సంఘటనా స్థలానికి అదనపు ఎస్సై మునీరుల్లా చేరుకుని రైతులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.