మార్కెట్లలో దూకుడు
ABN , First Publish Date - 2022-05-21T08:42:37+05:30 IST
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం రేసు గుర్రంలా పరుగెత్తాయి.
1,534 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: గురువారం భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం రేసు గుర్రంలా పరుగెత్తాయి. దీంతో సెన్సెక్స్ 1,534.16 పాయింట్ల లాభంతో 54,326.39 వద్ద, నిఫ్టీ 456.75 పాయింట్ల లాభంతో 16,266.15 వద్ద ముగిశాయి. గత మూడు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఒకేరోజు ఈ స్థాయిలో దూసుకుపోవడం ఇదే మొదటిసారి. దీంతో బీఎ్సఈలో నమోదైన కంపెనీల షేర్ల మార్కెట్ విలువ (మార్కెట్ క్యాప్) రూ.5.05 లక్షల కోట్లు పెరిగి రూ.254.14 లక్ష ల కోట్లకు చేరింది. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండడం, చౌకగా దొరుకుతున్న మంచి కంపెనీల షేర్ల కోసం మదుపరులు ఎగబడడం ఈ రిలీఫ్ ర్యాలీకి బాగా దోహదం చేసింది.
చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు స్వల్పంగా తగ్గించడమూ శుక్రవారం మార్కెట్కు కలిసొచ్చింది. వారం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వారం సెన్సెక్స్ 1,532.77 పాయింట్లు, నిఫ్టీ 484 పాయింట్లు లాభపడ్డాయి.