మళ్లీ పంజా విసిరిన పులి

ABN , First Publish Date - 2022-08-13T05:54:54+05:30 IST

మండలంలోని నల్లకొండ అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. మండలంలోని చంద్రయ్యపేటలో గురువారం రాత్రి పశువులపై దాడి చేసి, ఒక గేదెను చంపేసింది.

మళ్లీ పంజా విసిరిన పులి
పులి పంజాకు బలైన గేదె

చంద్రయ్యపేటలో గేదెపై దాడి

అటవీ శాఖ అధికారులు పరిశీలన

పులిని త్వరగా బంధించాలని ప్రజలు వినతి


కె.కోటపాడు, ఆగస్టు 12: మండలంలోని నల్లకొండ అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న పెద్దపులి మళ్లీ పంజా విసిరింది. మండలంలోని  చంద్రయ్యపేటలో గురువారం రాత్రి పశువులపై దాడి చేసి, ఒక గేదెను చంపేసింది. సుమారు మూడు వారాల నుంచి కె.కోటపాడు, సబ్బవరం మండలాల సరిహద్దు ప్రాంతంలోనే పులి సంచరిస్తుండడం, పశువులపై దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. 

చంద్రయ్యపేట గ్రామానికి చెందిన సబ్బవరపు దేముడుబాబు అనే రైతుకు దుర్గమ్మగుడి సమీపంలో పశువుల కల్లం వుంది. రోజూ చీకటి పడిన తరువాత పశువులకు మేత వేసి ఇంటికి వెళ్లిపోయి, మరుసటి రోజు ఉదయం వచ్చి పాలు తీస్తుంటారు. శుక్రవారం ఉదయం పశువుల శాల వద్దకు వెళ్లిచూడగా ఒక గేదె చనిపోయి కనిపించింది. దీంతో పులి దాడిచేసినట్టు నిర్ధారించుకున్న ఆయన ఈ విషయాన్ని గ్రామస్థులకు, అటవీ శాఖ అధికారులకు తెలియపరిచారు. పెందుర్తి, అనకాపల్లి నుంచి ఫారెస్ట్‌ అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపులి గత మూడు వారాల నుంచి చోడవరం, సబ్బవరం, కె.కోటపాడు మండలాల పరిధిలో వున్న నల్లకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నదని చెప్పారు. దీనిని బంధించడానికి బుధవారం చౌడువాడలో పెద్ద సైజు బోను ఏర్పాటు చేశామని, 24 గంటల్లోనే పెద్దపులి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని చంద్రయ్యపేట వచ్చి గేదెపై దాడి చేసి చంపేసిందని చెప్పారు. పులిని బంధించడానికి పలురకాల చర్యలు చేపట్టినా ఫలితం వుండడం లేదన్నారు. కాగా పెద్దపులి రెండు మూడు రోజులకోసారి గ్రామాల శివారుల్లోకి వచ్చి పశువులపై దాడి చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2022-08-13T05:54:54+05:30 IST