Hyderabad మెట్రోకు కేంద్రం మళ్లీ మొండిచేయి.. మనకొచ్చిందల్లా ఇదొక్కటే..!
ABN , First Publish Date - 2022-02-02T13:15:09+05:30 IST
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి శీతకన్ను వేసింది. కేంద్ర బడ్జెట్లో
హైదరాబాద్ సిటీ : హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి శీతకన్ను వేసింది. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోకు ఈసారైనా చేయూతనందిస్తారని అధికారులు భావించినప్పటికీ రూపాయి కూడా విదల్చలేదు. ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఈబీఆర్టీఎస్) అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేసి మెట్రో నియోను అందుబాటులోకి తీసుకొస్తారని ఎదురుచూసినప్పటికీ నిరాశే ఎదురైంది.
నో సౌండ్..
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు అత్యంత సౌకర్యవంతమైన ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడంతో ప్రజలు అసంతృప్తికి లోనవుతున్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు కూడా లేదు. ప్రత్యేక రైళ్ల మంజూరును పట్టించుకోలేదు. రైల్వే ప్రైవేటీకరణలో భాగంగానే ఎలాంటి ప్రకటనా చేయలేదని ఉద్యోగ సంఘాల నాయకులు వాపోతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రం ఎలాంటి కేటాయింపులు చేసిందో ఇక ‘పింక్ బుక్’ ద్వారానే తెలుస్తుందని పేర్కొన్నారు.
మనకొకటి..!
400 వందేభారత్ రైళ్లను వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి తీసుకొస్తామని బడ్జెట్లో ప్రకటించారు. దీంతో సికింద్రాబాద్ - పుణె మార్గాల నడుమ నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వందే భారత్ రైళ్లను తీసుకురానున్నారు. ఈ ఏడాది చివరిలోగా సికింద్రాబాద్ - విజయవాడ మీదుగా వందేభారత్ రైలు నడిచే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.