నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా Kavitha ఏకగ్రీవం
ABN , First Publish Date - 2021-11-24T20:15:50+05:30 IST
సీఎం కేసీఆర్ కూతురు, సిటింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు....
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కూతురు, సిటింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో కవితకు లైన్ క్లియర్ అయ్యింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్లోనే ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవమైనట్లు ప్రకటన వచ్చేసింది.
కాగా.. కవిత ప్రస్తుత మండలి సభ్యత్వం త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడంలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను ఢిల్లీకి పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిటింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్ఎస్ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ.. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది.