చిత్తూరు, కడప, నెల్లూరు, అనంత జిల్లాల్లో మళ్లీ Heavy Rains
ABN , First Publish Date - 2021-11-29T18:22:56+05:30 IST
బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తన ...
చిత్తూరు/అమరావతి : బంగాళాఖాతంలో శ్రీలంక తీరప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. రిజర్వాయర్ల ఎగువ ప్రాంతాల్లో నదులు, వాగులు పొంగుతున్నాయి. సోమశిల జలాశయానికి 96 వేల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు ద్వారా 1.16 లక్షల క్కూసెక్యులు పెన్నా నదికి విడుదల చేయడం జరిగింది. మరోవైపు పెన్నా వరద ఉధృతికి నది అంచున ఉండే కట్ట కోతకు గురవుతోంది.
నిన్న అంతా భారీ వర్షమే..
కాగా.. ఆదివారం రోజంతా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి వర్షపాతం 56.9 మిల్లీమీటర్లగా నమోదైంది. ఆదివారం ఉదయం తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. అ త్యధికంగా బుచ్చిరెడ్డిపాలెంలో 142.2 మి.మీ, ఆత్మకూరులో 105.8 మి.మీ వర్షం కురిసింది. కొడవలూరులో 97.2, సం గంలో 97, విడవలూరులో 96.6, నెల్లూరులో 94.4, కోవూరులో 93, అల్లూరులో 86.8, నాయుడుపేటలో 80.6, అనంత సాగరంలో 75, ఇందుకూరుపేటలో 73.2, దొరవారిసత్రంలో 67.2, పొదలకూరులో 66.2, పెళ్లకూరులో 62.2, బాలాయ పల్లిలో 60.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సీతారామపురంలో10.8 మి.మీ వర్షం కురిసింది. భారీవర్షాల కారణంగా పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.