ఏపీలో ఇంటింటి సర్వే ద్వారా కరోనాపై అవగాహన : సీఎస్
ABN , First Publish Date - 2020-05-24T04:58:25+05:30 IST
ఈ నెల 25 నుంచి కరోనా వైరస్పై ఇంటింటి సర్వే ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు తీసుకుంటామని..
అమరావతి : ఈ నెల 25 నుంచి కరోనా వైరస్పై ఇంటింటి సర్వే ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు రెండు కరపత్రాలను ప్రచురించడం జరిగిందన్నారు. వీటిని జిల్లాల్లో అవసరమైన సంఖ్యలో ప్రచురించి అవి ప్రతి ఇంటికీ పంపిణీ చేసి వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 25 అనగా సోమవారం నుంచి చేపట్టే 5వ విడత ఇంటింటా సర్వేలో ప్రధానంగా కరోనా ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. ఏఎన్ఎం, ఆశావర్కర్, గ్రామ/వార్డు వాలంటీర్లతో కూడిన బృందం ఇంటింటీకీ వెళ్ళి ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పారు. ఇందుకుగాను సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.