హిజాబ్,హలాల్,లౌడ్ స్పీకర్ల నిషేధం తర్వాత పండ్ల వ్యాపారంపై హిందూ సంస్థల గురి

ABN , First Publish Date - 2022-04-06T17:11:59+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్,హలాల్,లౌడ్ స్పీకర్ల నిషేధం తర్వాత పండ్ల వ్యాపారంపై హిందూ సంస్థలు గురి పెట్టాయి....

హిజాబ్,హలాల్,లౌడ్ స్పీకర్ల నిషేధం తర్వాత పండ్ల వ్యాపారంపై హిందూ సంస్థల గురి

బెంగళూరు(కర్ణాటక):కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్,హలాల్,లౌడ్ స్పీకర్ల నిషేధం తర్వాత పండ్ల వ్యాపారంపై హిందూ సంస్థలు గురి పెట్టాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యం చలాయిస్తున్నందున ఎక్కువ మంది హిందువులు ఇందులో భాగస్వాములు కావాలని హిందూ జనజాగృతి సమితి కోఆర్డినేటర్ చంద్రు మోగేర్ కోరారు.హిందువులంతా హిందూ విక్రేతల నుంచి పండ్లను కొనుగోలు చేయాలని మోగేర్ ట్విట్టరులో కోరారు.‘‘పండ్ల వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని హిందువులను అభ్యర్థిస్తున్నాను’’ అని మోగేర్ కోరారు.


హిందూ మితవాద నాయకుడు ప్రశాంత్ సంబర్గి కూడా ముస్లిం పండ్ల వ్యాపారులను బహిష్కరించడంపై తన ఆలోచనలను పంచుకున్నారు.పండ్ల వ్యాపారంలో ముస్లిం విక్రేతలను తీసివేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ సంబర్గి కోరారు.పండ్ల వ్యాపారానికి పెద్ద మార్కెట్‌ ఉందని, మధ్యవర్తులను తొలగించడం ద్వారా రైతులు తమ దిగుబడికి సముచితమైన ధరలు పొందుతారని రైతులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యం అని ప్రశాంత్ చెప్పారు. కాగా కొన్ని సంస్థలు కర్ణాటకలో సమస్యలను ప్రేరేపించడానికి యత్నిస్తున్నాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పారు.ద్వేషం లేకుండా అందరూ మతసామరస్యంతో ఉండాలని మంత్రి కోరారు.


ముస్లింల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేయకపోవడం దేశ వ్యతిరేకమని, రైతులకు వ్యతిరేకమని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.ముస్లింలను బహిష్కరించాలని హిందూ సంఘాలు ఇచ్చిన పిలుపు దేశానికి, రైతులకు వ్యతిరేకంగా చేసిన ద్రోహం అని కుమారస్వామి అన్నారు.


Updated Date - 2022-04-06T17:11:59+05:30 IST