పెళ్లయిన కొద్ది రోజులకే భర్త అదృశ్యం.. చంపిందెవరో పోలీసులకు తెలిసినా 8 ఏళ్లుగా నిరీక్షణ.. దృశ్యం 2 ని మించిన ట్విస్టులెన్నో..!
ABN , First Publish Date - 2022-04-10T02:06:16+05:30 IST
పెద్దలు చూసిన సంబంధానికి ఆ యువతి, యువకుడు ఓకే చెప్పారు. కుటుంబ సభ్యల సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిగింది. భర్తతో కలిసి నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. అ తర్వాతే అసలు కథ మొదలైంది. ఉన్నట్టుండి భర్త కనిపించకుండా పోయా
ఇంటర్నెట్ డెస్క్: పెద్దలు చూసిన సంబంధానికి ఆ యువతి, యువకుడు ఓకే చెప్పారు. కుటుంబ సభ్యల సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిగింది. భర్తతో కలిసి నూతన వధువు అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో కొన్ని రోజులు అలా గడిచిపోయాయి. అ తర్వాతే అసలు కథ మొదలైంది. ఉన్నట్టుండి భర్త కనిపించకుండా పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. అందరూ ఒకే వ్యక్తిని అనుమానించారు. పోలీసులు కూడా అనుమానితుడిని తమదైన శైలిలో విచారించారు. అయినా నేరం భయటపడలేదు. ఇలా ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఎట్టకేలకు తాజాగా పోలీసులు ఈ కేసులో విజయం సాధించారు. సినిమా స్టోరీని తలపించే ఈ క్రైమ్పై ఓ లుక్కేస్తే..
ఢిల్లీకి చెందిన రవి అనే వ్యక్తికి రాజస్థాన్లోని అల్వార్కు చెందిన శకుంతల అనే మహిళకు 2011లో వివాహం జరిగింది. శకుంతల తన భర్తతో కలిసి అత్తారింటిల్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో కమల్ అనే వ్యక్తి శకుంతల స్నేహితుడిగా పరిచయమై తరచూ ఆమె అత్తారింటికి వచ్చిపోవడం మొదలు పెట్టారు. శకుంతల ఇంటి పక్క యువకుడు కావడంతో ఆమె అత్తామామ కూడా ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే రవి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతడి జాడ దొరకలేదు. ఈ క్రమంలో రవి కుటుంబ సభ్యులు కమల్పై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కూడా కమల్ను తమదైన శైలిలో విచారించారు. అయితే కమల్ తనకేమీ తెలియదని వాదించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు.. కోర్టు అనుమతితో కమల్కు పాలీగ్రాఫీ టెస్ట్ చేశారు. అందులో కమల్ క్లీన్ చిట్ పొందాడు. చేసేదేమీ లేక పోలీసులు కమల్ను విడిచిపెట్టారు. అనంతరం ఇతర పనుల్లో పడి పోలీసులు ఈ కేసును పక్కన పెట్టారు.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని ఢిల్లీ హైకోర్టును రవి తండ్రి ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో మళ్లీ కదలిక వచ్చింది. కోర్టు ఆదేశాలతో కమల్కు పోలీసులు బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ నిర్వహించారు. దీంతో 8ఏళ్ల తర్వాత నిజం బయటపడింది. రవిని కమల్ హతమార్చినట్టు టెస్టులో వెల్లడైంది. కానీ ఆ ఫలితాలు వచ్చే సరికే కమల్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అల్వార్లోని తన ట్రాన్స్పోర్ట్ షాప్కు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలోని రవి సమాధి వద్దకు చేరుకున్నాడు. సమాధిలోని అస్థిపంజరాన్ని తీసి, దాన్ని 70 ముక్కలుగా చేసి వాటిని కిలో మీటర్ల వ్యవధిలో పడేశాడు. ఈ క్రమంలో కేసును సీరియస్గా తీసుకున్న అధికారలు.. ఎట్టకేలకు రవి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించారు. అనంతరం అతడికి సంబంధించిన కొన్ని అవశేషాలను సేకరించారు. ఎప్పటికప్పుడు కళ్లు గప్పి పారిపోతున్న కమల్ను పట్టుకునేందుకు పోలీసులు అతడి డ్రైవర్ గణేష్ను అదుపులోకి తీసుకున్నారు.
అతడి వద్ద నుంచి కమల్ పర్సనల్ నెంబర్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడి ఉనికి గుర్తించిన అధికారులు ఎట్టకేలకు కమల్ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. శకుంతల, కమల్ ప్రేమించుకున్నారని.. కులాలు వేరవడం వల్ల తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో ఆ విషయాన్ని బయటపెట్టలేదని చెప్పారు. ఇంతలో శకుంతలకు రవితో వివాహం జరిగినట్టు పేర్కొన్నారు. అయితే ఆమెను మర్చిపోలేకపోయిన కమల్.. శకుంతలను కలిసేందుక తరచూ ఆమె ఇంటికి వెళ్లేవాడని వెల్లడించారు. ఎప్పటిలాగే ఓ రోజు శకుంతల అత్తారింటికి వెళ్లిన కమల్.. రవిని ఇంట్లోంచి బటయకు తీసుకొచ్చాడని తెలిపారు. అనంతరం డ్రైవర్ గణేష్కు రూ.70వేలు ఇచ్చి రవిని హతమార్చినట్టు చెప్పారు. ఎవ్వరికి అనుమానం రాకుండా శవాన్ని తన షాప్ ముందే పాతిపెట్టాడని వివరించారు.