16 ఏళ్ల తర్వాత డోన్‌ రాజకీయాల్లోకి..

ABN , First Publish Date - 2021-01-19T05:58:47+05:30 IST

డోన్‌ నియోజకవర్గ రాజకీయాల్లోకి మళ్లీ కేఈ ప్రభాకర్‌..

16 ఏళ్ల తర్వాత డోన్‌ రాజకీయాల్లోకి..

టీడీపీ బాధ్యతలు తీసుకుంటున్నట్లు కేఈ ప్రభాకర్‌ ప్రకటన 


డోన్(కర్నూలు): డోన్‌ నియోజకవర్గ రాజకీయాల్లోకి మళ్లీ కేఈ ప్రభాకర్‌ అడుగు పెట్టారు. 16 ఏళ్ల తర్వాత ఆయన టీడీపీ బాధ్యతలను తీసుకున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వారసునిగా 1996లో కేఈ ప్రభాకర్‌ డోన్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అప్పుడు డోన్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కేఈ ప్రభాకర్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో సీఎం చంద్రబాబు క్యాబినెట్‌లో విద్యాశాఖ, అటవీశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 1999 ఎన్నికల్లో డోన్‌ అసెంబ్లీ నుంచి రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో డోన్‌ నుంచి మరోమారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఈ ప్రభాకర్‌ మొదటి సారి ఓడిపోయారు. తర్వాత డోన్‌ నియోజకవర్గ రాజకీయాలకు దూరమయ్యారు. 2014 నుంచి టీడీపీ డోన్‌ ఇన్‌చార్జిగా కేఈ ప్రతాప్‌ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.


ఇటీవల హైదరాబాదులో కేఈ కృష్ణమూర్తి నివాసంలో కేఈ ప్రతాప్‌, కేఈ ప్రభాకర్‌ భేటీ అయినట్లు తెలిసింది. డోన్‌ టీడీపీ బాధ్యతలను తీసుకోవాలని కేఈ ప్రభాకర్‌ను కోరినట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డోన్‌ బాధ్యతలు తీసుకోవాలని కేఈ ప్రభాకర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఆ మేరకు సోమవారం డోన్‌లో జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో డోన్‌ బాధ్యతలు తీసుకుంటున్నట్లు కేఈ ప్రభాకర్‌ ప్రకటించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఆయన మంత్రి బుగ్గనపై విరుచుకుపడ్డారు. తనను డోన్‌ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారన్నారు. పరిస్థితుల కారణంగా పత్తికొండకు డిప్యుటేషన్‌పై వెళ్లానని, మళ్లీ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన డోన్‌కు వచ్చానని ప్రకటించారు. ఇక నుంచి డోన్‌ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. ఏ ఆపద వచ్చినా కేఈ ప్రభాకర్‌ ముందుంటారని భరసా ఇచ్చారు. తన సత్తా ఏమిటో చూపిస్తానన్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతానన్నారు. 

Updated Date - 2021-01-19T05:58:47+05:30 IST