కూతురికి పెళ్లి చేసి సంతోషంగా అత్తారింటికి పంపిన తల్లిదండ్రులు.. 10 రోజుల్లోనే అలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించి ఉండరు

ABN , First Publish Date - 2022-07-02T14:07:45+05:30 IST

అందరు తల్లిదండ్రుల్లానే వాళ్లూ ఆలోచించారు. కూతురికి పెళ్లీడు రాగానే.. సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ యువకుడిని చూసి.. తమ కూతురిని అతడికిచ్చి పెళ్లి జరిపించారు. అనంతరం సంతోషంతో ఆమెను అత్తా

కూతురికి పెళ్లి చేసి సంతోషంగా అత్తారింటికి పంపిన తల్లిదండ్రులు.. 10 రోజుల్లోనే అలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించి ఉండరు

ఇంటర్నెట్ డెస్క్: అందరు తల్లిదండ్రుల్లానే వాళ్లూ ఆలోచించారు. కూతురికి పెళ్లీడు రాగానే.. సంబంధాలు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ యువకుడిని చూసి.. తమ కూతురిని అతడికిచ్చి పెళ్లి జరిపించారు. అనంతరం సంతోషంతో ఆమెను అత్తారింటికి సాగనంపారు. అయితే పెళ్లైన 10 రోజుల్లోనే కూతురి గురించిన వార్త విని షాకయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా చర్చనీయాంశం అయిన ఈ ఘటన‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఉత్తరప్రదేశ్‌లోని ఫరుకాబాద్‌కు చెందిన మోహన్‌లాల్ రాథోర్ దంపతులు తమ కూతురు ధన్ దేవీకి రవీంద్ర అనే యువకుడికి జూన్ చివరి వారంలో పెళ్లి జరిపించారు. వివాహానంతరం ధన్ దేవీ.. పుట్టింటిని వీడి భర్తతో కలసి అత్తారింట్లో అడుగు పెట్టింది. ఈ క్రమంలో పెళ్లి వేడుక ఘనంగా జరిపించామనే సంతోషం.. మోహన్‌లాల్ రాథోర్ దంపతులకు పట్టుమని 10 రోజులు కూడా నిలవలేదు. కూతురికి సంబంధించిన విషాదకర వార్త వారి చెవిన పడింది. అత్తారింట్లో ధన్ దేవీ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందనే వార్త విని ఆ దంపతులు తల్లడిల్లిపోయారు. వెంటనే కూతురి మెట్టినింటికి చేరుకున్నారు. అనంతరం అల్లుడు రవీంద్ర సహా అతడి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోలీసులను ఆశ్రయించారు. అదనపు కట్నం, కారు కోసం భర్త సహా అత్తామామలు వేధించడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2022-07-02T14:07:45+05:30 IST