పాస్పోర్ట్లు, ఐడీ కార్డులు ఇస్తాం.... శుభవార్త చెప్పిన తాలిబన్లు
ABN , First Publish Date - 2021-10-05T23:48:59+05:30 IST
తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ కొత్త ప్రభుత్వం తమ పౌరులకు నేటి (మంగళవారం) నుంచి పాస్పోర్టులు
కాబూల్: తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘనిస్థాన్ కొత్త ప్రభుత్వం తమ పౌరులకు నేటి (మంగళవారం) నుంచి పాస్పోర్టులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కౌన్సిల్ మినిస్టర్స్ ఆఫ్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ నిన్న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పౌరులకు పాస్పోర్టులతోపాటు తజ్కిరా (జాతీయ ఐడీ కార్డు)ను కూడా జారీ చేస్తామన్నారు.
ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఈ రెండింటి జారీ నిలిచిపోయింది. ఇప్పుడు వీటిని పునరుద్ధరించాలని తాలిబన్ ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు 5,000-6,000 పాస్పోర్టులు జారీ చేస్తామని పాస్పోర్టు కార్యాలయం తాత్కాలిక హెడ్ అలామ్ గుల్ హక్కానీ తెలిపారు.
కార్యాలయంలోని మహిళా ఉద్యోగులు మహిళలకు సంబంధించిన పాస్పోర్టు వ్యవహారాలు చూస్తారని పేర్కొన్నారు. లక్ష పాస్పోర్టులు ప్రాథమిక దశలో పరిశీలనలో ఉండగా, 25 వేల పాస్పోస్టులు చివరి దశలో ఉన్నాయని అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తి తెలిపారు.