125 హెక్టార్లలో అడవుల పెంపకం
ABN , First Publish Date - 2022-05-24T05:42:59+05:30 IST
తూప్రాన్ ఆటవీ రేంజ్ పరిధిలో 125 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు రంగం సిద్ధం చేశారు.
తూప్రాన్ రేంజ్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
తూప్రాన్, మే 23: తూప్రాన్ ఆటవీ రేంజ్ పరిధిలో 125 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు రంగం సిద్ధం చేశారు. నీలగిరి చెట్లను తొలగించిన ప్రదేశంలోనే అటవీ సంబంధిత మొక్కలను నాటనున్నారు. ఇప్పటికే అటవీ భూములు సిద్ధం చేయగా, వర్షాలు కురియడమే తరువాయి.. హరితహారం కింద మొక్కలు నాటనున్నారు. తూప్రాన్ ఫారెస్టు రేంజ్ పరిధిలో తూ ప్రాన్, మనోహరాబాద్, వెల్ధుర్తి, చేగుంట, మాసాయిపేట మండలాలు ఉన్నాయి. తూప్రాన్ రేంజ్ పరిధిలో దాదాపు 125 హెక్టార్లలో ఆరేడు ఏళ్ల క్రితం నాటిన నీలగిరి చెట్లను ఇటీవలనే కత్తిరించి అమ్మకాలు చేపట్టారు. నీలగిరి చెట్లను తొలగించిన అటవీ భూముల్లో అడవి జాతి మొక్కలను నాటేందుకు రంగం సిద్ధం చేశారు. హరితహారంలో ఒక్కో హెక్టారుకు 1,111 మొక్కలు నాటేందుకు నిర్ణయించగా, తూప్రాన్ రేంజ్ పరిధిలో 1,38,875 మొక్కలు నాటనున్నారు. తూప్రాన్ రేంజ్ పరిధిలోని హరితహారంలో మర్రి, వేప, రావి, వేరుమద్ది, నల్లమద్ది, తాని, కరక, నమిలినార, చిట్రేగి, రెడ్ సాండల్, తుర్కవేప, జువ్వి, సీతాఫలం, వెలగ, చింత, మారేడు, ఉసిరి, నారేటి, కదంబ, బాంబు, బండారు మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే ఈ మొక్కలు నర్సరీలలో సిద్దం చేశారు. నర్సరీలలో అడుగు, అడుగున్న మొక్కలు సిద్ధం చేశారు. వర్షాలు మొదలవడంతోనే హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తూప్రాన్ రేంజర్ మోహన్ వెల్లడించారు. కేవలం అటవీ సంబంధిత మొక్కలను మాత్రమే నాటనున్నట్టు ఆయన వివరించారు.