రూ.1.3 కోట్లతో అధునాతన ఎక్స్రే యూనిట్
ABN , First Publish Date - 2021-11-29T07:22:50+05:30 IST
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి హైదరాబాదు సనత్ నగర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత వెంకటేష్ దంపతులు రూ.1.3 కోట్ల విలువైన రూఫ్ సస్పెండెడ్ అల్ర్టా మోడరన్ డిజిటల్ ఎక్స్రే యూనిట్ను విరాళంగా అందించారు.
బర్డ్ ఆస్పత్రికి అందజేసిన దాత
తిరుపతి సిటీ, నవంబరు 28: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి హైదరాబాదు సనత్ నగర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అధినేత వెంకటేష్ దంపతులు రూ.1.3 కోట్ల విలువైన రూఫ్ సస్పెండెడ్ అల్ర్టా మోడరన్ డిజిటల్ ఎక్స్రే యూనిట్ను విరాళంగా అందించారు. ఈ ఎక్స్రే యంత్రాన్ని ఆదివారం టీటీడీ అదనపు ఈవో, ఆస్పత్రి ఎండీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆస్పత్రిలో ఉచితంగా, మెరుగైన సేవలు అందిస్తున్న తరుణంలో ఆధునిక పరిజ్ఞానం కల్గిన వైద్య పరికరాలు ఎంతో అవసరమన్న ఉద్దేశంతో ఈ యంత్రాన్ని అందించినట్లు వెంకటేష్ తెలిపారు. డాక్టర్లు కిషోర్ కుమార్, రామ్మూర్తి, వేణుగోపాల్, దీపక్, ఏఈవో పార్థసారఽథి, రేడియాలజి ఇన్చార్జ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
రోగికి ఇబ్బంది లేకుండా.. సులువుగా ఎక్స్రే
రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా (రోగిని అటూ.. ఇటూ కదపకుండా.. యంత్రానికే ఉన్న టేబుల్ను తిప్పుతూ) సులువుగా ఎక్స్రే తీయొచ్చు. ఇలాంటి అధునాతన పరిజ్ఞానం ఉన్న ఎక్స్రే యూనిట్ రాయలసీమలోనే ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ లేదు. ఇందులో ఎక్స్రే హైక్వాలిటీతో వస్తుంది. పైగా రోగికి వైద్యం అందించే డాక్టర్కు కేవలం నిమిషంలోనే వాట్సా్పలో ఎక్స్రే వెళుతుంది. అలాగే ఒక కాపీ ఆస్పత్రి రికార్డుల్లో భద్రంగా ఉంటుంది. పైగా ఆస్పత్రిలో క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుండటం వల్ల ఎక్స్రేని రోగులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూసే వీలుంది. టీటీడీ ఈవో జవహర్రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కృషితో రెండ్రోజుల కిందట సువర్ణ సాఫ్ట్వేర్, ఇప్పుడీ ఎక్స్రే యూనిట్ ప్రారంభించాం. త్వరలోనే ఆధునిక సీటీ స్కాన్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం.
- రెడ్డెప్పరెడ్డి, బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి