కల్తీ తేనె
ABN , First Publish Date - 2020-12-03T08:08:42+05:30 IST
ఆరోగ్యానికి మంచిదని రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకునే అలవాటుందా? డబ్బు ఎంతైనా పర్వాలేదు.. స్వచ్ఛమైనదనదైతే చాలు అనే నమ్మకంతో టాప్ బ్రాండ్లకు
చక్కెర పాకం కలుపుతున్న కంపెనీలు
కల్తీ జాబితాలో పతంజలి, బైద్యనాథ్,
డాబర్ సంస్థలు.. మూడు మాత్రమే పాస్
కేంద్ర శాస్త్రీయ పర్యావరణ సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 2: ఆరోగ్యానికి మంచిదని రోజూ ఉదయాన్నే కొద్దిగా తేనె తీసుకునే అలవాటుందా? డబ్బు ఎంతైనా పర్వాలేదు.. స్వచ్ఛమైనదనదైతే చాలు అనే నమ్మకంతో టాప్ బ్రాండ్లకు చెందిన తేనెను కొంటున్నారా? అయితే ఆ తేనె స్వచ్ఛమైనది కాకపోవచ్చు.. ఎందుకంటే తేనెలో చక్కెర పాకాన్ని కలిపి.. స్వచ్ఛమైనదంటూ విక్రయిస్తున్నారు. అనామక కంపెనీలే కాదు.. డాబర్, పతంజలి, బైద్యనాథ్ వంటి సుప్రసిద్ధ సంస్థలూ ఈ కల్తీ దందాను నడుపుతున్నట్లు తేలింది. ఈవిషయాన్ని సాక్షాత్తూ కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన శాస్త్రీయ, పర్యావరణ సంస్థ (సీఎ్సఈ) పేర్కొంది. సీఎ్సఈ చీఫ్ సునీత నరైన్ కథనం ప్రకారం.. సీఎ్సఈకి చెందిన పరిశోధకులు 13 కంపెనీల నుంచి తేనె శాంపిళ్లను సేకరించి న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ పరీక్షల కోసం జర్మనీలోని ల్యాబ్లకు పంపారు.
అక్కడ జరిపిన పరీక్షల్లో 13 కంపెనీల్లో మూడు కంపెనీలు.. సఫోలా, మార్క్ఫెడ్ సోనా, సొసియేట్ నేచురల్లీవి మాత్రమే కల్తీ ఉత్పత్తులు కావని తేలింది. డాబర్, పతంజలి, బైద్యనాథ్, ఎమామి (జండు), హిత్కారి, అపిస్ హిమాలయ తదితర కంపెలన్నీ కూడా ఎన్ఎంఆర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి. ఈ విషయమై వివరణ కోసం డాబర్, ఎమామి (జండు), పతంజలి కంపెనీలకు సీఎ్సఈ మెయిల్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. బైద్యనాథ్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులను ఇంకా సంప్రదించలేదు. కాగా ఈ పదమూడు కంపెనీలకు చెందిన శాంపిళ్లను తొలుత గుజరాత్లోని డెయిరీ డెవల్పమెంట్ బోర్డు (ఎన్డీడీబీ)కు చెందిన సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైవ్స్స్టాక్ అండ్ ఫుడ్ (సీఏఎల్ఎఫ్) సంస్థకు పంపి ప్రాథమిక పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో చిన్న ప్రముఖ బ్రాండ్లన్నీ కూడా పాస్ అయ్యాయి. చిన్న బ్రాండ్లు మాత్రం చక్కెరను మిక్స్ చేసి తేనెను కల్తీ చేసినట్లు తేలింది. అయితే పూర్తిస్థాయిలో కల్తీని తేల్చే ఎన్ఎంఆర్ పరీక్షల కోసం జర్మనీలోని ల్యాబ్లకు పంపగా పది కంపెనీల కల్తీ దందా బయటపడింది. ఈ నివేదికపై డాబర్, పతంజలి సంస్థలు స్పందించాయి. తమ బ్రాండ్ల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలా చేసినట్లనిపిస్తోందని పేర్కొన్నాయి. తాము సహజ పద్ధతుల్లో తేనెను సేకరిస్తామని.. చక్కెరనో ఇంకేదో కలిపి కల్తీ చేయడం జరగదని వివరణ ఇచ్చాయి.