వెళ్ళగొడుతున్నారు...కార్మికుల సంక్షేమం పట్టని ఎంసీసీ యాజమాన్యం
ABN , First Publish Date - 2020-08-05T09:42:58+05:30 IST
జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) యాజమా న్యం కార్మికులను బలవంతంగా వదిలించుకొనే ప్రయత్నం
ఉద్యోగాల నుంచి బలవంతపు తొలగింపునకు శ్రీకారం
ఇప్పటికే 20 మందికి సెటిల్మెంట్లు
కొవిడ్ వేళ కార్మికుల పొట్టగొట్టే యత్నం
యాజమాన్య వైఖరికి నిరసనగా కార్మికుల ధర్నా
మంచిర్యాల టౌన్, ఆగస్టు 4: జిల్లా కేంద్రంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) యాజమా న్యం కార్మికులను బలవంతంగా వదిలించుకొనే ప్రయత్నం చేస్తోంది. వారి సంక్షేమం గురించి ఆలోచించకుండా కొవిడ్ వైరస్ సమయంలో కార్మికుల పొట్ట గొ ట్టేందుకు సిద్ధపడింది. కార్మిక చట్టాలను తుంగలో తొ క్కుతూ 10 -15 సంవత్సరాలు సర్వీసు ఉండగా ఒక రోజు ముందు హఠాత్తుగా సమాచారం ఇచ్చి సెటిల్మెంట్లు చేస్తోంది. కార్మికుల సంక్షేమం ఏ మాత్రం పట్టని యాజమాన్యం దశలవారీగా వదిలించుకొనేందుకు కుట్రలు చేస్తోంది. కంపెనీ ఆధీనంలో ఉన్న భూముల ధరలు పెరగడంతో ఫ్యాక్టరీనివిచ్ఛిన్నం చేసి, అధికలాభాలు గడించే దిశగాపావులు కదుపుతోంది.
చట్ట విరుద్ధంగా కార్మికుల తొలగింపు
ఎంసీసీ యాజమాన్యం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జూలై నెల చివర్లో 20 మంది కార్మికులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించింది. కంపె నీలో ప్రస్తుతం 95 మంది పర్మనెంట్ కార్మికులు ఉండగా వారిని సాగనంపేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. యాజమాన్యం, కార్మికులు పరస్పరం అంగీకారంతో సమస్యను పరిష్కరించుకోవాలని ప్రాం తీయ లేబర్ కమిషనర్ సూచించినప్పటికీ అకస్మాత్తుగాతొలగించడంపై కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల మూలవేతనం రూ. 2 వేలు సూచి స్తూ ఆరు నెలలకు రూ. 24 వేల వరకు చెల్లించి వా రిని వదిలించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.మరో 35 మం ది జాబితాసిద్ధంగా ఉందనికార్మికులుపేర్కొంటున్నారు.
కార్మికుల ధర్నా..
యాజమాన్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ సిమెంట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కంపెనీ ద్వారం ఎదుట మంగళవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గాజుల ముకేష్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్లు మాట్లాడుతూ ఎంసీసీ యాజమాన్యం కార్మిక వ్యతిరేక ధోరణిని మానుకోవాలన్నారు. కార్మికులకు చట్ట ప్రకారం ఇవ్వవలసిన బోనస్, ఇంక్రిమెంట్లు, అడ్వాన్సులు చెల్లించకుండా వేధిస్తోందని ఆరోపించారు. కరోనా సమయంలో కార్మికుల ఉద్యోగాలు తొలగించి, వారి కుటుంబాలను రోడ్డున పడేయాలని చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. యాజమాన్యం కార్మికుల సంక్షేమం కోసం ఆలోచించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.