రైతు భూమికి పక్కా రక్షణ: ఇన్చార్జి కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-16T06:30:17+05:30 IST
రైతు భూమికి పక్కా రక్షణ కల్పించి, భూ తగాదాలు తలెత్తకుండా చేయడమే లక్ష్యమని ఇన్చార్జి కలెక్టర్ రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు.
ఆదోని, ఏప్రిల్ 15: రైతు భూమికి పక్కా రక్షణ కల్పించి, భూ తగాదాలు తలెత్తకుండా చేయడమే లక్ష్యమని ఇన్చార్జి కలెక్టర్ రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమావేశ భవనంలో డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. శాశ్వత భూ హక్కు, భూ రక్షపై రీ సర్వే, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నావ న్నారు. 1910-12లో మాత్రమే భూ సర్వే జరిగిందని అన్నారు. ఆ తర్వాత 1995లో జరిగిన భూ సర్వేలో మార్పులు, చేర్పులు చేశారని అన్నారు. రీ సర్వేను అన్ని గ్రామాల్లో నిర్వహించి రైతుకు పక్కా టైటిల్, భూమికి పక్కా రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఆదోని డివిజన్లో 10 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేశామని, అన్నదమ్ముల మధ్య భూవివాదాలు ఉంటే తహసీల్దార్, లేదా ఆర్డీవో లేదా జేసీకి ఫిర్యాదు చేయాలని, అప్పటికీ సమస్య తీరదనుకుంటే కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవచ్చన్నారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఎన్నో ఏళ్లుగా భూమి రీ సర్వే చేస్తునే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీనివాసులు, రాఘవేంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారి హరికృష్ణ పాల్గొన్నారు.