ఆదివాసీ సంబరం
ABN , First Publish Date - 2022-08-09T05:44:18+05:30 IST
పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పార్వతీపురంలో వేడుకలు ప్రారంభం
అడవి తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు
సంప్రదాయ నృత్యం చేసిన గిరిజనులు, అధికారులు
పార్వతీపురం - ఆంధ్రజ్యోతి/ బెలగాం, ఆగస్టు 8 : పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గిరిజన సంఘాల నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈనెల 9న సీతంపేట ఐటీడీఏలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా పార్వతీపురంలో సంబరాలు ప్రారంభించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం తొలుత ఐటీడీఏ పీవో, జాయింట్ కలెక్టర్ ఒ.ఆనంద్ తన నివాసం నుంచి ఊరేగింపుగా ఐటీడీఏ కార్యాలయానికి వచ్చారు. అక్కడ అడవి తల్లి విగ్రహానికి పూలు, పాలతో అభిషేకం చేశారు. అనంతరం విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి సారె అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు, అధికారులు కలిసి థింసా నృత్యం చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు వాటిని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జేసీ ఆనంద్ అన్నారు. ఈ వేడుకలో ఐటీడీఏ ఏపీవో సురేష్కుమార్, జిల్లా గిరిజన విద్యాశాఖ అధికారి పి.కిరణ్కుమార్, గురుకుల కార్యాలయ ఇన్చార్జి రామారావు, ఏఈ తిరుపతిరావు , గిరిజన సంఘాల నాయకులు పి.రంజిత్కుమార్, పారమ్మ, సురేష్, గౌరమ్మ, తమ్మయ్య, సాయిబాబు, చంద్రశేఖర్, సీతందొర, సీతారాం, రమణ, నాగార్జున, గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.