ఆదివాసీ మహిళా ఫ్రొఫెసర్పై సహచర ప్రొఫెసర్ వేధింపులు
ABN , First Publish Date - 2022-01-25T02:53:06+05:30 IST
ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్కు సహచర ప్రొఫెసర్ నుంచి తీవ్రస్థాయిలో వేధింపులు
కోల్కతా: ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ సహచర ప్రొఫెసర్ నుంచి తీవ్రస్థాయిలో వేధింపులు ఎదుర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. శబంగ్ కాలేజీలో పనిచేస్తున్న బాధిత ప్రొఫెసర్ను అదే కాలేజీలో బెంగాలీ బోధించే నిర్మల్ బేరా సూటిపోటి మాటలతో వేధించేవారు. ఆయన వేధింపులను బాధిత ప్రొఫెసర్ కొన్నాళ్లపాటు మౌనంగా భరించారు. అయితే, అవి మితిమీరడంతో గత నెల 19న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఆదివాసీ సామాజిక వర్గం కోసం పనిచేసే ఎన్జీవో ‘భారత్ జకత్ మాఝీ పరగణ మహల్’ కాలేజీకి చేరుకుని నిందితుడైన ప్రొఫెసర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బాధిత ఫ్రొఫెసర్ పక్షాన మరింత మంది నిలవడంతో సమస్య జఠిలంగా మారింది.
దీంతో దిగొచ్చిన పోలీసులు నిందితుడైన ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రొఫెసర్ అయి ఉండీ, ఇతరులకు బోధిస్తూ సహచర ఆదివాసీ ప్రొఫెసర్ను సహించలేకపోవడం, ఆమెను దుర్భాషలాడడంతో చాలామంది ఆయనను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ను తెరపైకి తెచ్చారు. విద్యావంతులే ఇలా చేయడం దారుణమని పలువురు మండిపడుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.