West Bengal New Districts : బెంగాలీలు మిమ్మల్ని క్షమించరు... మమత బెనర్జీకి అధిర్ రంజన్ చౌదరి హెచ్చరిక...

ABN , First Publish Date - 2022-08-03T01:15:15+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో నూతన జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత లేదని కాంగ్రెస్

West Bengal New Districts : బెంగాలీలు మిమ్మల్ని క్షమించరు... మమత బెనర్జీకి అధిర్ రంజన్ చౌదరి హెచ్చరిక...

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో నూతన జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత లేదని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముర్షీదాబాద్ జిల్లాను మూడు ముక్కలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి మమత బెనర్జీని బెంగాలీలు క్షమించరని హెచ్చరించింది. రాష్ట్రంలో ఏడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నట్లు మమత సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 


ముర్షీదాబాద్ జిల్లాను ముర్షీదాబాద్, బహరంపూర్, కండి జిల్లాలుగా విభజించాలని నిర్ణయించినట్లు మమత ప్రకటించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాను మూడు జిల్లాలుగానూ, దక్షిణ 24 పరగణాలు, నాడియా, బంకుర జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాను రెండేసి జిల్లాలుగా విభజించాలని నిర్ణయించామన్నారు. మొత్తం మీద ఐదు జిల్లాలను విభజించి, 12 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో పశ్చిమ బెంగాల్ మ్యాప్‌లో ఏడు కొత్త జిల్లాలు చేరుతున్నట్లు చెప్పారు. 


ఈ నేపథ్యంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, ముర్షీదాబాద్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ఈ జిల్లా పేరు మార్పును కాంగ్రెస్ అంగీకరించబోదన్నారు. ఈ పేరు మార్పును బెంగాలీలు అంగీకరించరన్నారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో భాగమైన జిల్లాను ముక్కలు చేయడాన్ని ప్రజలు క్షమించరని చెప్పారు. మమత నిర్ణయంపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోందన్నారు. 


ముర్షీదాబాద్ జిల్లాను ముక్కలు చేసి, బెంగాల్ చరిత్రను తుడిచేయాలని మమత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ జిల్లా చరిత్ర, సంప్రదాయాలను ఈ విధంగా తుడిచేయకూడదని చెప్పారు. జిల్లాను విభజించినప్పటికీ, ఆ పేరుకు ఉన్న గుర్తింపు మారబోదన్నారు. ఈ జిల్లా పేరును యథాతథంగా కొనసాగించాలని తాము రాష్ట్రవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 


పశ్చిమ బెంగాల్‌లో జిల్లాల సంఖ్య 23 నుంచి 30కి పెరిగింది. సుందర్బన్, ఇచ్ఛామతి, బసీర్హట్, రానాఘాట్, బిష్ణుపూర్, బహరంపూర్, కండి జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-03T01:15:15+05:30 IST