వందే భారత్ మిషన్: యూఏఈలోని ఎన్నారైలకు కాన్సులేట్ జనరల్ కీలక సూచన
ABN , First Publish Date - 2020-07-14T18:53:22+05:30 IST
'వందే భారత్ మిషన్'లో భాగంగా యూఏఈ నుంచి ఎన్నారైల తరలింపు కోసం అదనంగా వేసిన ఎయిరిండియా విమాన సర్వీసులకు సంబంధించిన టికెట్లను మంగళవారం ఉదయం 9 గంటల నుంచి నేరుగా విక్రయించనున్నట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ప్రకటించింది.
యూఏఈ: 'వందే భారత్ మిషన్'లో భాగంగా యూఏఈ నుంచి ఎన్నారైల తరలింపు కోసం అదనంగా వేసిన ఎయిరిండియా విమాన సర్వీసులకు సంబంధించిన టికెట్లను మంగళవారం ఉదయం 9 గంటల నుంచి నేరుగా విక్రయించనున్నట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(సీజీఐ) ప్రకటించింది. దుబాయి నుంచి న్యూఢిల్లీ, ముంబై, వారణాసి, మంగళూరుకు ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. కనుక స్వదేశానికి రావాలనుకునే, భారత ఎంబసీలో తమ పేరు నమోదు చేసుకున్న భారత ప్రవాసులు http://airindiaexpress.in వెబ్సైట్లో విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
ఈ మేరకు ట్వీట్ చేసిన సీజీఐ... ఎయిరిండియా వెబ్సైట్ ద్వారా లేదా గుర్తింపు పొందిన యూఏఈ ట్రావెల్ ఏజెంట్ల దగ్గర టికెట్లు కొనుగోలు చేయొచ్చని తెలిపింది. సాధారణ విమాన చార్జీలకే ఈ రిపాట్రియేషన్ టికెట్లు విక్రయించనున్నట్లు పేర్కొంది. అయితే, టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికుడు/ప్రయాణికురాలికి సంబంధించిన పాస్పోర్ట్ వివరాలు, కాంటాక్ట్ సమాచారం తప్పనిసరి అని సూచించింది.