తిరుమలకు అదనపు ఘాట్‌రోడ్డు!

ABN , First Publish Date - 2021-12-04T07:16:45+05:30 IST

తిరుమల జీఎన్సీ నుంచి మోకాళ్లమెట్టు వద్దవున్న లింక్‌రోడ్డు వరకు అదనపు ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తిరుమలకు అదనపు ఘాట్‌రోడ్డు!

తిరుమల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల జీఎన్సీ నుంచి మోకాళ్లమెట్టు వద్దవున్న లింక్‌రోడ్డు వరకు అదనపు ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డులో కొండరాళ్లు విరిగిపడితే వాహనదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా లింక్‌రోడ్డు ద్వారా తిరుమలకు సులువుగా చేరుకునేలా ఈ మార్గాన్ని ఏర్పాటు చేయాలని గతంలో టీటీడీ నిర్ణయించింది.2018లోనే ఎల్‌ఆండ్‌టీ సంస్థ  సర్వే చేయడంతో పాటు డిజైన్‌, రూట్‌మ్యాప్‌ తదితర అంశాలపై ఓ నివేదికను తయారు చేసింది. అయితే కొన్ని కారణాలతో నిలిచిపోయిన ఈ అంశం తిరిగి తెరపైకి వచ్చింది. సాధారణంగా తిరుమల నుంచి తిరుపతికి దిగే మొదటి ఘాట్‌రోడ్డు కంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండవ ఘాట్‌లోనే అధికంగా రాళ్లు విరిగిపడుతుంటాయి. అందులోనూ 13వ కిలోమీటరు నుంచి తిరుమలకు వరకు భారీగా కొండరాళ్లు విరిగిపడుతుంటాయి. వర్షాకాలంలో భక్తులు ఆ మార్గంలో ప్రయాణించాలంటే భయాందోళనకు గురవుతుంటారు.అనుకోకుండా బండరాళ్లు పడితే వాటిని తొలగించే వరకు ఇబ్బంది పడాల్సిందే. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం రెండవఘాట్‌లోని 13వ కిలోమీటరు నుంచి మొదటిఘాట్‌ లోని మోకాళ్లమెట్టు వరకు అనుసంధానం చేస్తూ లింక్‌రోడ్డును టీటీడీ ఏర్పాటు చేసింది. 13వ కిలోమీటరు తరువాత అనుకోకుండా రాళ్లు విరిగిపడితే  లింక్‌ రోడ్డు నుంచి మోకాళ్లమెట్ట్టుకు చేరుకుని దిగే రోడ్డులోనే వాహనాలు తిరుమలలోని జీఎన్సీ వద్దకు చేరుకునేవి. ఇలా 15 నిమిషాలు వెళ్లిన తరువాత మోకాళ్లమెట్టు వద్ద గేటు వేసేవారు.ఆ తరువాత మరో 15 నిమిషాల పాటు జీఎన్సీ నుంచి వాహనాలను కిందకు పంపేవారు. ఇలా చేయడంతో భక్తులకు ప్రయాణ సమయం అదనంగా గంట  పట్టేది.ఐఐటీ నిపుణులు ఇచ్చిన కొన్ని సూచనలు, సలహాల మేరకు మోకాళ్లమెట్టు నుంచి జీఎన్సీ టోల్‌గేట్‌ వరకు 2.8 (కిలోమీటర్లు) మరో రెండు లైన్ల రోడ్డును అదనంగా ఏర్పాటు చేసుకుంటే రెండవఘాట్‌లో రాళ్లు విరిగిపడినా లింక్‌ రోడ్డు నుంచి నేరుగా తిరుమల జీఎన్సీకి చేరుకోవచ్చని టీటీడీ ఉన్నతాధికారులు భావించారు. అయితే కొన్ని కారణాలతో ఆగిపోయిన ఈ ప్రతిపాదన తిరిగి తెరపైకి వచ్చింది. లింక్‌రోడ్డుకు ఎగువభాగంలో ఇటీవల భారీగా బండరాళ్లు పడడంతో పరిశీలించడానికి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం ‘జీఎన్సీ టూ మోకాళ్లమెట్టు’ రోడ్డు ఏర్పాటు విషయాన్ని టీటీడీ దృష్టికి గురువారం తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో వచ్చే టీటీడీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-12-04T07:16:45+05:30 IST