శశికళను చేర్చుకోండి.. స్వయంగా కోరిన అమిత్‌ షా

ABN , First Publish Date - 2021-03-03T07:26:55+05:30 IST

తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌), ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) చరిష్మా సరిపోదని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

శశికళను చేర్చుకోండి.. స్వయంగా కోరిన అమిత్‌ షా

అన్నాడీఎంకేపై బీజేపీ ఒత్తిడి?



చెన్నై, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీని ఎదుర్కొనేందుకు ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌), ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) చరిష్మా సరిపోదని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారికి అండగా ఉండేందుకు దివంగత జయలలిత సన్నిహితురాలైన వీకే శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చేందుకు కమల నాథులు గట్టి ప్రయత్నాలు ప్రారంభించినట్టు ప్రచారం జరుగుతోంది. శశికళను చేర్చుకునేలా ఈపీఎస్‌, ఓపీఎ్‌సలపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే.. బీజేపీ ప్రతిపాదనకు పన్నీరు సెల్వం సుముఖత వ్యక్తం చేయగా, పళనిస్వామి మాత్రం విముఖత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 6న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న అన్నాడీఎంకే, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. 


బీజేపీ తమిళనాడు ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, వీకే సింగ్‌, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌లుగా ఉన్న సీటీ రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో ఈపీఎస్‌, ఓపీఎస్‌ చర్చించారు. రెండు రోజుల కిందట కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోనూ వారిద్దరూ కలిసి చెన్నైలో చర్చించారు. ఈ సందర్భంగా షా కూడా శశికళను పార్టీలో చేర్చుకోవాలని, తద్వారా అన్నాడీఎంకే మరింత బలోపేతమవుతుందని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ.. ఈపీఎస్‌ విముఖత చూపినట్లు సమాచారం. అన్నాడీఎంకేలో సుమారు సగం మంది నాయకులు శశికళను పార్టీలో చేర్చుకోవాలని కోరుకుంటున్నారు. పార్టీలో ఆమెకు అనుయాయులు సైతం భారీగానే ఉన్నారు. అయితే, శశికళను కనుక చేర్చుకుంటే పార్టీలో గ్రూపులు ఏర్పడతాయని, పార్టీ తన చేతుల్లోంచి జారిపోతుందని పళని స్వామి ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ విషయాన్ని ఆయన చూచాయగా అమిత్‌షా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. కానీ, డీఎంకేను ఎదుర్కొనేందుకు ప్రస్తుతమున్న బలం సరిపోదని అమిత్‌షా కుండబద్దలు కొట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా చర్చలు ముగించినట్లు అన్నాడీఎంకేకు చెందిన ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-03-03T07:26:55+05:30 IST