‘ఓ బేబి’, ‘జాంబిరెడ్డి’ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో, హీరో డా॥రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్గా రామ్ మల్లిక్ దర్శకత్వంలో చంద్రశేఖర్ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘అద్భుతం’. ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫాం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో నవంబర్ 19న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక యూనివర్సల్ ప్రాబ్లమ్ వలన ఇద్దరికి ఒకే ఫోన్ నెంబరు రావడం జరుగుతుంది. అయితే హీరో ఫోన్ నంబర్.. హీరోయిన్ ఫోన్ నంబర్ ఒకటే కావడం, అదే వాళ్ల పరిచయానికి కారణం కావడం.. అనే అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. కథ ఫ్రెష్గా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎన్నో చిత్రాలు విడుదలకు ఇబ్బందు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ నా విషయానికి వస్తే మాత్రం చాలా హ్యాపీ. నా వరకు ఈ సంవత్సరం విడుదలవుతున్న 3వ చిత్రమిది. ఒక టిపికల్ సబ్జెక్ట్ను దర్శకుడు రామ్ మల్లిక్గారు నిజంగానే ‘అద్భుతం’గా డీల్ చేశారు. ‘ఓ బేబీ’ సినిమా కన్నా ముందు ఈ ప్రాజెక్ట్ అనుకున్నాం. ఇక షూట్కు వెళ్లిపోదాం అనుకుంటుండగా, ‘ఓ బేబీ’ అవకాశం వచ్చింది నాకు. ఆ సినిమా ద్వారా ఎక్కువమంది ఆడియెన్స్కు రీచ్ అయ్యే అవకాశం ఉండటంతో అది ఈ సినిమాకు ప్లస్ అవుతుందనే స్వార్ధంతో ముందుగా ‘ఓ బేబీ’ చేశాను. ప్రేక్షకుల ఊహలను, అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎక్కువ ట్విస్ట్లు, టర్నింగ్లు ఉన్న ఎంగేజింగ్ కథ ఇది. ట్రైలర్ చూసిన ప్రేక్షకుల అంచనాలకు మరెన్నో వండర్స్ యాడ్ చేసే చిత్రమిది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.