టెలికాం సేవల్లోకి అదానీ
ABN , First Publish Date - 2022-07-09T07:18:25+05:30 IST
భారత కుబేరుడు, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ టెలికాం సేవల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు
ఇక అంబానీ, మిట్టల్, బిర్లాకు మరో పోటీదారు
న్యూఢిల్లీ: భారత కుబేరుడు, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ టెలికాం సేవల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ప్రారంభం కానున్న 5జీ టెలికాం స్పెక్ట్రమ్ వేలంలో అదానీ గ్రూప్ కూడా పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వేలంలో పాల్గొనేందుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిట్టల్కు చెందిన ఎయిర్టెల్, కుమార మంగళం బిర్లా భాగస్వామిగా ఉన్న వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వారు వెల్లడించారు. దీంతో 5జీ సేవల్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు అదానీ నుంచి గట్టిపోటీ ఎదురుకావచ్చు. అదానీ గ్రూప్ ఈమధ్యనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్డీ) లైసెన్సులు కూడా దక్కించుకుంది. బిడ్డింగ్లో పాల్గొనే విషయంపై అదానీ ఇంకా స్పందించలేదు. అయితే, బిడ్డింగ్ దరఖాస్తుదారుల వివరాలను టెలికాం శాఖ ఈ నెల 12న విడుదల చేశాక పూర్తి స్పష్టత రానుంది. ఈసారి రూ.4.31 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ల స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నట్లు టెలికాం శాఖ వెల్లడించింది.