ఏపీలో భారీ ప్రాజెక్టు నుంచి అదానీ కంపెనీ వైదొలగడం వెనుక..

ABN , First Publish Date - 2020-03-28T20:37:39+05:30 IST

సంతబొమ్మాళి మండలంలో నిర్మించతలపెట్టిన భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనుల నుంచి అదానీ కంపెనీ వైదొలగింది. ఈ మేరకు టెండర్లు రద్దు చేసుకుంది. 2300 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి అదానీ కంపెనీ, సెజ్ లిమిటెడ్ గతంలో టెండర్లు కైవసం చేసుకున్నాయి.

ఏపీలో భారీ ప్రాజెక్టు నుంచి అదానీ కంపెనీ వైదొలగడం వెనుక..

టెక్కలి (శ్రీకాకుళం జిల్లా): సంతబొమ్మాళి మండలంలో నిర్మించతలపెట్టిన భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనుల నుంచి అదానీ కంపెనీ వైదొలగింది. ఈ మేరకు టెండర్లు రద్దు చేసుకుంది. 2300 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి అదానీ కంపెనీ, సెజ్ లిమిటెడ్ గతంలో టెండర్లు కైవసం చేసుకున్నాయి. షేర్లపై 2018 మార్చి 27న లెటర్ ఆఫ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాయి. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా 33 ఏళ్లు కలిసి పనిచేసేందుకు ఈ రెండూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి అవసరమైన భూ సేకరణ చేపట్టాలని గత ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశించింది. దీంతో మర్రిపాడు, భావనపాడు, దేవునళ్తాడ గ్రామాల పరిధిలోని భూ సేకరణకు చర్యలు చేపట్టారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 2300 ఎకరాల భూమికి రూ.1202 కోట్లు అవసరమని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కాకినాడ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ గత ఏడాది సెప్టెంబర్‌ 27న తాము రూ.500 కోట్లు మాత్రమే భూములకు చెల్లించగలమని, మిగిలిన రూ.702 కోట్లు తము సాధ్యం కాదని ప్రకటించింది. ఇందుకు అదానీ కంపెనీ ఏకీభవించలేదు. తాము అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని, ఇప్పటి వరకు చెల్లించిన ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫీజు, బ్యాంక్ గ్యారెంటీ తిరిగి చెల్లించాలని కోరింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఈవో పోర్టు ట్రస్ట్ ఈ విషయాన్ని పరిశీలించి అదానీ కంపెనీ టెండర్ల రద్దుకే మెగ్గుచూపింది.

Updated Date - 2020-03-28T20:37:39+05:30 IST