‘సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ’

ABN , First Publish Date - 2022-08-17T05:59:49+05:30 IST

గ్రామాలలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నట్లు డీప్యూటీ డీఎంహెచ్‌వో జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.

‘సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ’

గడివేముల, ఆగస్టు 16: గ్రామాలలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నట్లు డీప్యూటీ డీఎంహెచ్‌వో జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన గడివేముల ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలలో మెరుగైన వైద్య సేవలు అందించేం దుకు ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయం పరిధిలో డాక్టర్‌, ఆరోగ్య సిబ్బంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం వైద్యులు సచివాలయం పరిధిలో ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. పోషకాహార లోపం, అనారోగ్యం బారిన పడిన పిల్లలను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలను అందిస్తారన్నారు. సీజనల్‌ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా గ్రామాల్లో విజృంభించకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యులు సృజన, ఎంపీహెచ్‌ఈవో మహేశ్వర్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:59:49+05:30 IST