అక్రమ లేఅవుట్లపై చర్యలు శూన్యం

ABN , First Publish Date - 2021-04-16T05:44:33+05:30 IST

పెద్దపల్లి పట్టణ చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ రియల్‌ వెంచర్లపై కొరఢా ఝళిపించాల్సిన మున్సిపల్‌ శాఖాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

అక్రమ లేఅవుట్లపై చర్యలు శూన్యం
కూనారం రోడ్డులో అక్రమంగా వెలసిన రియల్‌ వెంచర్లు

- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు

- పెద్దఎత్తున చేతులు మారుతున్న ముడుపులు

- కొత్తగా వెలుస్తున్న రియల్‌ వెంచర్లు

- ప్రేక్షకపాత్ర వహిస్తున్న ప్రజాప్రతినిధులు

- పట్టించుకోని మున్సిపల్‌ శాఖాధికారులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి పట్టణ చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ రియల్‌ వెంచర్లపై కొరఢా ఝళిపించాల్సిన మున్సిపల్‌ శాఖాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా సబ్‌రిజిష్ట్రార్లు అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్‌ చేస్తుండడంతో కొత్తగా వెంచర్లు పుట్టుకు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తుండడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. డీటీసీపీ అనుమతులు లేకుండానే రియల్‌ వ్యాపారులు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు. నిబంధనలు తెలియని కొనుగోలుదారులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. అనుమతులు లేకుండా వెలుస్తున్న వెంచర్లలో ప్లాట్ల హద్దురాళ్లను తొలగించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తొలగించడం లేదని తెలుస్తున్నది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని రిజిస్ట్రేషన్లకు అడ్డు రాకుండా చూసుకుంటున్నట్లు పెద్దపల్లిలో ప్రచారం జరుగుతున్నది. ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొంత మొత్తంలో సొమ్మును ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. 

పుట్టుకొస్తున్న వెంచర్లు..

పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత పట్టణం చుట్టూగల రంగంపల్లి, కూనారం రోడ్‌, ధర్మారం రోడ్‌, చందపల్లి, బంధంపల్లి, పెద్దకల్వల, మంథని రోడ్డులో రియల్‌ వెంచర్లు వెలిశాయి. సుమారు 170 నుంచి 200ఎకరాల వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు పెట్టి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. ప్లాట్ల విక్రయాలు జరపాలంటే డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌(డీటీసీపీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమి అయితే తప్పనిసరిగా నాలా కన్వర్షన్‌ చేయాలి, కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం 40 అడుగుల వెడల్పుతో రోడ్లు ఏర్పాటు చేసి, ఇతర సౌకర్యాలు కల్పించి, మున్సిపాలిటీకి 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలి. అవేమి లేకుండానే పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో 52కు పైగా అక్రమంగా వెంచర్లు వెలిసినట్లు మున్సిపల్‌ అధికారులు గుర్తించారు. కేవలం ఒకటి, రెండు వెంచర్లకు మాత్రమే డీటీసీపీ అనుమతులున్నాయి. గత ఏడాది ఆయా వెంచర్లలో హద్దురాళ్లను తొలగించిన అధికారులు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్‌ రిజిష్ట్రార్‌కు లేఖ కూడా రాశారు. సుల్తానాబాద్‌ కమిషనర్‌, డీపీఓ కూడా లేఖలు రాశారు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కూడా పెద్దపల్లిలో వెలసిన అక్రమ లేఅవుట్ల గురించి ప్రశ్నను లేవనెత్తారు. ప్రభుత్వం కూడా డీటీసీపీ అనుమతులు లేని ప్లాట్లను రిజిష్టర్‌ చేయవద్దని ఆదేశాలు కూడా జారీచేసింది. అప్పటినుంచి జిల్లాలో అనుమతి లేని లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రియల్‌ వ్యాపారం స్థంభించి పోయింది. ధరణి నేపథ్యంలో సెప్టెంబర్‌ 8వ తేదీ నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్‌ నెలాఖరులో ప్రారంభం అయ్యాయి. అయితే డాక్యుమెంట్‌ టు డాక్యుమెంట్‌ మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశాలుంటే వాటిని బేఖాతరు చేస్తూ సబ్‌రిజిష్ట్రార్లు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకున్న రియల్‌ వ్యాపారులు ప్లాట్ల విక్రయాలను తిరిగి మొదలుపెట్టారు. రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకపోవడంతో క్రయవిక్రయాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామశివారులో కొత్తగా వెలిసిన ఒక రియల్‌ వెంచర్‌లో డీటీసీపీ అనుమతులు లేకుండానే ప్లాటింగ్‌ చేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు పంచాయతీ అధికారులు వెంచర్‌లో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించారు. దీనికి అనుమతులు లేవని, ఇక్కడ ఎవరు కూడా ప్లాట్లను కొనుగోలు చేయరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోగల అనుమతి లేని రియల్‌ వెంచర్లలో యథేచ్ఛగా క్రయ, విక్రయాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే నాథుడు లేదు. ప్లాట్లను కొనుగోలు చేస్తున్న వాళ్లు భవిష్యత్తులో ఇంటి అనుమతులకు వెళితే కొత్త చట్టం ప్రకారం అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవు. 20నుంచి 30 అడుగుల వెడల్పుతోనే రోడ్లు ఉన్నందున కొత్త చట్టం ప్రకారం 40 అడుగుల రోడ్లు ఉండాలి. ఆ మేరకు రోడ్లు లేకపోవడంతో ప్లాట్లను కొనుగోలు చేస్తున్న వాళ్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమేర్పడింది. వారికి అనుమతులు ఇవ్వాలంటే తప్పరిసరిగా ఎల్‌ఆర్‌ఎస్‌ చెల్లించి సెట్‌బ్యాక్‌ కావాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వెలిసే రియల్‌ వెంచర్లను తొలగించేందుకు గాను ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో అన్ని జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు జిల్లాలో వెలసిన అక్రమ లేఅవుట్ల విషయమై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై కొరఢా ఝుళిపించాలని ప్రజలు కోరుతున్నారు. 

ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం..

- తిరుపతి, పెద్దపల్లి మున్సిపల్‌ కమిషనర్‌

మున్సిపల్‌ పరిధిలో డీటీసీపీ అనుమతి లేకుండా వెలసిన వెంచర్లను గుర్తించాం. వీటిలోగల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్‌ రిజిష్ట్రార్‌కు లేఖ రాశాం. ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీచేసింది. రియల్‌ వ్యాపారులు హద్దురాళ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు చేపడుతాం. అందులో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం. నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతులు ఇస్తాం. డీటీసీపీ అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.  

Updated Date - 2021-04-16T05:44:33+05:30 IST