యంత్రాంగం సేవలు భేష్‌

ABN , First Publish Date - 2021-10-20T05:10:31+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలో పోలీసులు సేవాభావంతో విధులు నిర్వహించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు.

యంత్రాంగం సేవలు భేష్‌
సిరిమానోత్సవంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఇలా..

  అన్ని శాఖల సమన్వయంతో చర్యలు 

  కలిసొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం 

  ఎక్కడికక్కడ బారికేడ్ల ఏర్పాటు 

  భక్తుల నుంచి ప్రశంసలు 

విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ రింగురోడ్డు/ విజయనగరం క్రైం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ సిరిమానోత్సవం సందర్భంగా మంగళవారం  నగరంలో   పోలీసులు సేవాభావంతో విధులు నిర్వహించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ఆధ్వర్యంలో ఎస్పీ దీపికాపాటిల్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీ, సాధారణ దర్శనాలకు  ఎటు వంటి ఇబ్బందులు లేకుండా చేశారు.  ఆలయం ఎదుట ఉన్న కంట్రోల్‌ రూం,  సీసీ కెమెరాలు, డ్రోన్‌, బాడీ కెమెరాలతో పాటు  అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది డీఎస్పీలు, 55 మం ది ీసీఐలు, 136 మంది ఎస్‌ఐలు, హెచ్‌సీలు ఏఎస్‌ఐలు 414, కాని స్టేబుళ్లు 652, హోంగార్డులు 365 మొత్తంగా 2,500 మంది సిరి మానోత్సవానికి బందోబస్తు నిర్వహించారు.  ట్రాఫిక్‌ డీఎస్పీ మోహనరావు  ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఎస్‌ఈబీ ఏఎస్‌పీ శ్రీదేవిరావు ఆధ్వర్యంలో నగరంలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఏఎస్పీ  సత్యనారాయణ, ఓఎస్‌డీ సూర్యచంద్రరావు, డీఎస్పీలు అనిల్‌ కుమార్‌, మోహనరావు, సుభాష్‌, త్రినాథ్‌, శేషాద్రి పాల్గొన్నారు. 

రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, దేవదాయ, కార్పొరేషన్‌ శాఖలు..

నగరంలో పారిశుధ్య పనులు, తాగునీరు, ప్రధాన కూడళ్లలో విద్యుదీకరణ తదితర ఏర్పాట్లు చేసి నగరపాలక సంస్థ ప్రశంసలు అందుకుంది. నగర మేయర్‌ వీవీ లక్ష్మి, డిప్యూటీ మేయర్లు  శ్రావణి, రేవతీదేవి ఆదేశాల మేరకు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ, కార్పొరేషన్‌ అధికారులు సమష్టి కృషితో ఏర్పాట్లు చేశారు.  రెవెన్యూ విభాగం అధికారులు ప్రొటోకాల్‌ను చక్కగా పాటించారు.  కలెక్టర్‌ సూర్యకుమారి,  జేసీలు కిషోర్‌కుమార్‌, వెంకటరావు, డీఆర్‌వో గణపతిరావు, ఆర్‌డీవో భవానీ శంకర్‌, విజయనగరం  తహసీల్దార్‌ ప్రభాకరరావు, పలువురు రెవెన్యూ సిబ్బంది  విశేష సేవలు అం దించారు. భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంలో దేవదాయ శాఖ అధికారులు విజయం సాధించారు. సిరిమానోత్సవ ప్రత్యేకా ధికారి మూర్తి, పైడిమాంబ దేవస్థానం ఈవో కిషోర్‌కుమార్‌తో  పాటు, ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు ఆలయాల నుంచి వచ్చిన 72 మంది దేవదాయశాఖ సిబ్బంది ఎంతో శ్రమిం చారు.  మూడు లాంతర్ల నుంచి అంబటి సత్తర్వు,  కోటతో పాటు ఇతర ముఖ్యకూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేయడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు కీలక పాత్ర పోషించారు.  

  విద్యుత్‌, వైద్య ఆరోగ్యశాఖలు.. 

నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సరిచేసి.. విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా  విద్యుత్‌శాఖాఽ దికారులు చర్యలు చేపట్టారు.   ఎస్‌ఈ మసీలామణి పర్యవేక్షణలో డీఈలు,  10 మంది ఎడీలు, 10 మంది ఏఈలు, 80 మందికి పైగా లైన్‌మెన్‌లు సేవలు అందించారు. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఇద్దరు లైన్‌మెన్లను సిద్ధంగా ఉంచారు.. పైడితల్లమ్మ ఆలయం ఎదుట ప్రత్యేక సెల్‌ను  ఏర్పాటు చేశారు.  సిరిమాను తిరిగే సమ యంలో మూడు లాంతర్లు నుంచి గంటస్తంభం, అంబటి సత్తర్వు ,  కోట వరకూ విద్యుత్‌ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు.  ఆ తర్వాత గంటలోనే తిరిగి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ప్రత్యేకంగా 10 అస్కా లైట్లును ఏర్పాటు చేశారు.   నగరంలోని సిటీబస్టాండ్‌, దాసన్నపేట,  ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌, చదురు గుడి ఇలా పలు ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌వీ రమణ కుమారి  పర్యవేక్షించారు.  చదురుగుడి , పోలీసు కంట్రోల్‌ రూం వద్ద 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. 

స్వచ్ఛంద సంస్థలు 

జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా సేవలు అందించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ఏటీకే, విజయనగరం యూత్‌ ఫౌండేషన్‌ తదితర సంస్థలు భక్తులకు ఉచితంగా మాస్క్‌లు, శానిటైజర్లు, మజ్జిగ, పులిహోర, వాటర్‌, భోజన ప్యాకెట్లను అందజేశారు. 

సమష్టి కృషితో ఉత్సవం విజయవంతం : కలెక్టర్‌ 

కలెక్టరేట్‌: ప్రజల సహకారం , ప్రజా ప్రతినిధుల సూచనలు, జిల్లా యంత్రాంగం సమష్టి కృషితో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం విజయవంతంగా నిర్వహించా మని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. సిరిమాను సంబంరం ప్రశాంతంగా ముగిసినందున ప్రతిఒక్కరికీ  కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు పది రోజుల పాటు రెవెన్యూ, కార్పొరేషన్‌ , దేవదాయశాఖ , పైడిమాంబ దేవస్థానం, పోలీసు తదితర శాఖలు ఎంతో సమన్వ యంతో పనిచేశారన్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహిం చామని పేర్కొన్నారు



Updated Date - 2021-10-20T05:10:31+05:30 IST