కార్వెంట్ మైనింగ్ అనుమతుల పునరుద్ధరణ చర్యలు అన్యాయం
ABN , First Publish Date - 2022-08-18T06:23:03+05:30 IST
మండలంలోని మర్రివలసలో కార్వెంట్ మైనింగ్ అనుమతుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టడం అన్యాయమని నియోజకవర్గ టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు అన్నారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
టీడీపీ నాయకుడు పైల ప్రసాదరావు
కె.కోటపాడు, ఆగస్టు 17: మండలంలోని మర్రివలసలో కార్వెంట్ మైనింగ్ అనుమతుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపట్టడం అన్యాయమని నియోజకవర్గ టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు అన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే భూములు అనుభవిస్తున్న నిరుపేదలను అయోమయానికి గురిచేసేలా అధికారులు ప్రయత్నించడం సరికాదన్నారు. విశాఖకు చెందిన ఎంఎఆర్.కుమారి పేరిట దాలివలస, మర్రివలస, పిండ్రంగి గ్రామాల్లో 30 ఎకరాలకు పైగా భూముల్లో కార్వెంట్ ఖనిజ తవ్వకాలు పునరుద్ధరణ ప్రయత్నాల్లో ఇది భాగ మన్నారు. మైనింగ్ ప్రతిపాదిత ప్రాం తంలో పేదలు అనుభవిస్తున్న భూములను ప్రభుత్వ భూమిగా చూపించి మైనింగ్ లీజు ప్లాన్లు పొందారని, ఇందుకు దొడ్డిదారిన సహకరించిన అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత మూలంగా తవ్వకాలు నిలిచి పోయాయని, పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మరలా అనుమతులు పొందేందుకు ప్రయత్నించడం దారుణమని ప్రసాదరావు పేర్కొన్నారు.